మురికి నీరు రోడ్డు పైకి.. మున్సిపల్ అధికారుల భారీ జరిమానా..!
హైదరాబాద్ : మురికి నీరు రోడ్డు పైకి వదలడంతో మున్సిపల్ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఇక వారు వేసిన ఫైన్ చూస్తే.. వామ్మో ఇలాంటి తప్పు చేయొద్దు అనే రేంజ్లో ఉండటం విశేషం. జీహెచ్ఎంసీ అధికారుల కొరడాతో మురికి నీరు రోడ్ల పైకి వదిలిన వారి జేబుకు భారీగా చిల్లు పడింది. వేయి కాదు పదివేలు అంతకన్నా కాదు.. ఏకంగా 2 లక్షల రూపాయల జరిమానా విధించడం చర్చానీయాంశంగా మారింది.
తప్పు చేస్తే శిక్ష తప్పదన్నట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. ఎవరికి వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నగరంలో అపరిశుభ్రత ఎక్కువైంది. మున్సిపల్ సిబ్బంది రోజువారీగా రోడ్లను శుభ్రం చేస్తున్నా.. కొందరి తీరు కారణంగా మళ్లీ చెత్త చెదారంతో నిండిపోతోంది. ఆ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా గుర్రుగా ఉన్నారు. పరిశుభ్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో ఓ నిర్మాణ సంస్థకు రెండు లక్షల జరిమానా విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆ పోస్టు కోసం ఎంత తెగింపు.. మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ..!
గచ్చిబౌలి వైపు వెళ్లే ఓల్డ్ ముంబై నేషనల్ హైవే దారిలో ఓ నిర్మాణ సంస్థ కన్స్ట్రక్షన్ చేపట్టింది. అయితే ఇప్పుడిప్పుడే నిర్మాణ దశ ప్రారంభం కావడంతో సెల్లార్లో వర్షపు నీరు నిలిచిపోయింది. అయితే సదరు నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు ఆ మురికి నీరును రోడ్డు పైకి వదిలేలా మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్నారు. ఆ నీటి కారణంగా ఆ మార్గంలోని రోడ్డు చిత్తడిగా మారింది.
దాంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుండటం.. మరోవైపు ఈ మురికి నీటితో రోడ్డంతా బురదమయం కావడం.. ట్రాఫిక్ జామ్కు కారణమవుతోంది. ఇదే అంశాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సంబంధిత అధికారులు సదరు నిర్మాణ సంస్థకు 2 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు పంపించారు.