ఇల్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్..! బిల్డింగ్ ప్లాన్ ఫ్రీ.. 48 గంటల్లో అనుమతి
హైదరాబాద్ : ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త. ఇకపై ఇంటి ప్లాన్ ఉచితంగా అందించడానికి జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 500 చదరపు గజాల (స్క్వేర్ యార్డ్స్) విస్తీర్ణం లోపు ఇళ్లు కట్టుకునే ప్రతి ఒక్కరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. అంతా అనుకున్నట్లు జరిగితే మరో 10 రోజుల్లో అంటే మే 1వ తేదీ నుంచే అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు.
2 దశాబ్ధాల బద్ద శత్రువులు..! కలగా గడిచిన 24 ఏళ్లు.. ఒకే వేదిక పైకి ములాయం, మాయావతి
ఇంటి ప్లాన్ ఫ్రీ.. జీహెచ్ఎంసీ కసరత్తు
హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల నిర్మాణం ఏ యేటికాయేడు పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 17 వేల కొత్త ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు అవుతున్నాయి. వాటిలో దాదాపు 80 శాతం వరకు 500 చదరపు గజాల్లోపు విస్తీర్ణం ఉన్న స్థలాల్లో కట్టే ఇళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే అలాంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత స్పీడ్ గా పర్మిషన్ ఇవ్వడానికి అధికారులు కసరత్తు చేశారు.
గురువారం (18.04.2019) నాడు లిబర్టీ చౌరస్తాలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ దానకిశోర్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇంటి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడమే గాకుండా, పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేనివిధంగా రూపుదిద్దాలని సూచించారు.
మే 1 నుంచి అమలు..! అవగాహన కల్పించండి
500 చదరపు గజాల్లోపు స్థలాల్లో ఇళ్లు కట్టుకునేవారికి ఇకపై ఇంటి ప్లాన్ ఫ్రీగా అందించనున్నట్లు తెలిపారు దానకిశోర్. దీనికోసం దాదాపు 2 వేల బిల్డింగ్ ప్లాన్స్ సిద్ధం చేశామని చెప్పారు. మే 1వ తేదీ నుంచి ఇవి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలోనే నచ్చిన ప్లాన్ సెలెక్ట్ చేసుకునే విధంగా వెబ్సైట్ తీర్చిదిద్దామన్నారు.
జీహెచ్ఎంసీ ఆమోదించి వెబ్సైట్లో పొందుపరిచిన ఇంటి ప్లాన్స్ సెలెక్ట్ చేసుకునేవారికి.. 48 గంటల్లోపు పర్మిషన్ ఇచ్చే అంశం పరిశీలించాల్సిందిగా టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులను ఆదేశించారు దానకిశోర్. దరఖాస్తు విధానమేంటి, ఎలా అప్లై చేయాలనే ప్రజల సందేహాలు తీర్చడానికి జోన్లవారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఇంజినీర్ ఛార్జీలు మిగిలే..!
ఇదివరకు ఇంటి ప్లాన్ కోసం జీహెచ్ఎంసీ నుంచి లైసెన్స్ పొందిన సర్వేయర్లు / ఇంజినీర్ల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ప్లాన్ వేయడానికి, పర్మిషన్ ఇప్పించడానికి వాళ్లు కొంత మొత్తం ఛార్జి చేస్తారు. జీహెచ్ఎంసీ తీసుకున్న కొత్త నిర్ణయంతో ఇంటి ప్లాన్ వేయించడానికయ్యే ఖర్చు మిగలనుంది. అలాగే కొంతమంది దళార్లు ఇంటి పర్మిషన్లు ఇప్పించడానికి పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇకపై అలాంటి బెడద తప్పనుంది. అంతేకాదు జీహెచ్ఎంసీ అధికారులు ఆమోదించి సెలెక్ట్ చేసిన 2వేల ప్లాన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే.. 48 గంటల్లో పర్మిషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
పారదర్శకత కోసమేనా?
వాస్తవానికి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సదరు ప్లాన్ ప్రకారం జీహెచ్ఎంసీ అధికారులు కొంత అధికారిక ఫీజు నిర్ణయిస్తారు. అయితే దళార్లు ఆ మొత్తంతో పాటు ఆ ఖర్చు, ఈ ఖర్చు అంటూ జనాల నుంచి బాగానే పిండుతున్నట్లు సమాచారం. వీటన్నింటికీ చెక్ పెట్టడానికే.. ఇంటి ప్లాన్ ఫ్రీ గా ఇవ్వడంతో పాటు 48 గంటల్లో పర్మిషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.