అక్కడ ఓకే.. మరీ ఇక్కడ.. సుమతమ్మ ఏం పాపం చేసింది: మల్లు రవి
వినాయక చవితి పర్వదినం వేళ సీఎం కేసీఆర్ బీహర్ వెళ్లిన సంగతి తెలిసిందే. గాల్వాన్ వ్యాలీ ఘర్షణ.. హైదరాబాద్ ప్రమాదంలో చనిపోయిన బీహర్ కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత మాట్లాడిన కేసీఆర్.. బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. కేసీఆర్ పర్యటనపై విపక్షాలు గుర్రుమీదున్నాయి. అయితే అందుకు మల్లు రవి ఓ కారణం కూడా చెప్పారు.
ఇతర రాష్ట్రాల ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరీ తెలంగాణ ఆర్మీ జవాన్ల కుటుంబాల సంగతి ఏంటీ అని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి ప్రశ్నించారు. బీహార్ వెళ్లి.. అక్కడి అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారని.. తెలంగాణ రాష్ట్రంలో గల కొండారెడ్డిపల్లికి చెందిన సుమతమ్మ భర్త యాదయ్య ఆర్మీ ఆఫీసర్ అని గుర్తుచేశారు. తొమ్మిదేళ్ల క్రితం డ్యూటీలో చనిపోయారని.. 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.
కానీ ఇంతవరకు భూమి, ఉద్యోగం ఇవ్వలేదని మల్లు రవి వివరించారు. వారికి సాయం అందకపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని చెప్పారు. పిల్లల చదువు భారంగా మారిందని సుమతమ్మ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సుమతమ్మ కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయకుంటే కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతామని చెప్పారు. మిలటరీలో చనిపోయి ప్రభుత్వ సాయం అందని వారి వివరాలు సేకరిస్తున్నామని మల్లు రవి పేర్కొన్నారు.
ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేస్తోన్న సాయం గొప్పదే.. మరీ స్థానికుల సంగతి ఏంటీ అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. ఇక్కడి వారికి కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు. మరీ దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలీ.