ప్రభుత్వ ఖజానాకు రూ.1000 కోట్లు, ఒక్క నెలలోనే జమ.. ఎలాగంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రూ.వెయ్యి కోట్లు వచ్చాయి. నెల వ్యవధిలోనే ఇంత మొత్తం రావడమే కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. స్థిరాస్తులు ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా జనవరి నెలలో రూ.930 కోట్ల ఆదాయం సమకూరింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా మరో రూ.60.75 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో రౌండ్ ఫిగర్ రూ. వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది.
పన్నుల ద్వారా వచ్చిన ఈ సొమ్ములో రూ.600 కోట్ల వరకు కేవలం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో నుంచే వచ్చాయని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల విషయంలో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి రికార్డు సంఖ్యలో 1.96 లక్షల దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరిగాయి. వ్యవసాయ భూముల దస్తావేజులు 48 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయని గణాంకాలు సూచిస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ల ద్వారా నెలకు మినిమం రూ.600 కోట్ల నుంచి రూ.650 కోట్ల వరకు ఆదాయం వస్తుంటుంది. లక్ష నుంచి 1.2 లక్షల వరకు దస్త్రాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. గత రెండు, మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తిరిగి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించింది.
దీంతో జనవరి నెలలో అధిక ఆదాయం వచ్చింది. 2019 మార్చిలో పన్నుల రూపంలో అత్యధికంగా రూ.750 కోట్ల రాబడి వచ్చింది. గతేడాది చివరి 3 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో జనవరిలో ఉన్న రిజిస్ట్రేషన్ల తాకిడే ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.