టీఆర్ఎస్ కుట్రలను ఛేదించి.. కుటుంబపాలనకు అంతం: దుబ్బాక గెలుపుపై రాంమాధవ్
హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు అనూహ్య విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రఘునందన్ రావుకు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. పలువురు నేతలు టీఆర్ఎస్ సర్కారుపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.
దుబ్బాక ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్ గెలుపు, మరో సర్వే బీజేపీకి పట్టం
అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్రలను ఛేదించి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. టీఆర్ఎస్ కుటుంబపాలనకు టీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయమని ఈ ఎన్నిక రుజువు చేసిందని బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
దుబ్బాకలో రఘునందన్ విజయంపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ గెలుపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన మలుపు అని అన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు.. టీఆర్ఎస్ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. రఘునందన్ రావుకు అభినందనలు తెలిపారు.
దుబ్బాకలో రఘునందన్ రావు చరిత్రాత్మక విజయం సాధించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ అన్నారు. గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బును వెదజల్లిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. పోలీసులతో వేధింపులకు కూడా దిగిందని విమర్శించారు.
Recommended Video
దుబ్బాక ప్రజలకు, బీజేపీ కార్యకర్తలు, నేతలకు ఈ సందర్భంగా రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తెలగాణ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. కాగా, దుబ్బాక ఉపఎన్నికల్లో 1079 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందిన విషయం తెలిసిందే. రెండోస్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.