చంద్రబాబు ఏపీ విషయం చెప్పు, నిన్ను నమ్మి రోడ్డునపడ్డారు: హరీష్ రావు గట్టి కౌంటర్
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావు గురువారం నిప్పులు చెరిగారు. ఏపీలో ఇచ్చిన హామీలను ఆయన ఎంత వరకు అమలు చేశారని ప్రశ్నించారు.
రైతులకు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి, ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు మాత్రమే చంద్రబాబు మాఫీ చేశారని చెప్పారు. విశ్వసనీయతకు కేసీఆర్ మారుపేరు అన్నారు. ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టుకు 2007లోనే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెప్పారు. 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రాణహిత - చేవెళ్లను చేపట్టారన్నారు.

చంద్రబాబు లేఖలు రాయలేదా?
తాము అధికారంలోకి వచ్చాక ఆయకట్టును 37 లక్షల ఎకరాలకు పెంచామని హరీష్ రావు చెప్పారు. ఆయకట్టు పెరిగితే అంచనా వ్యయం పెరగదా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూ.17వేల కోట్ల నుంచి రూ.38,500 కోట్లకు పెంచలేదా అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే చంద్రబాబు ఆపేందుకు లేఖలు రాయలేదా అని ప్రశ్నించారు.

మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు
2014లో బీజేపీతో పొత్తును చారిత్రక అవసరమని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు చారిత్రక అవసరమని అంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేసారు. నాలుగేళ్లు మోడీతో కలిసి ఉన్నప్పుడు లౌకికవాదం ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. హైకోర్టు విభజన కోసం మోడీని కేసీఆర్ నాలుగుసార్లు కలిశారన్నారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు హైకోర్టు విభజనను అడ్డుకున్నారని, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారన్నారు.

అదో దగా కూటమి
నాలుగు పార్టీలతో కూడిన మహాకూటమి ప్రజాకూటమి కాదని, అది దగా కూటమి అని హరీష్ రావు అన్నారు. ఏపీలో చెల్లని రూపాయి, తెలంగాణలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు వద్దంటున్న కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు రుద్దుతుందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఇంకా చాలా వరకు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు.

చంద్రబాబును నమ్ముకొని రైతులు రోడ్డున పడ్డారు
చంద్రబాబును నమ్ముకొని ఏపీలో రైతులు రోడ్డు మీద పడ్డారని హరీష్ రావు అన్నారు. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పిన ఆయన కనీసం వడ్డీలు కూడా ఇవ్వలేదని చెప్పారు. చంద్రబాబు, రాహుల్ గాంధీలు తెలంగాణ ప్రజల చెవుల్లో పూవులు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఏపీలో నిరుద్యోగులను మోసం చేశారన్నారు. 600 హామీలలో కనీసం పది పైసల వంతు కూడా అమలు చేయలేదని విమర్శించారు.

కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారు
కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని చెప్పారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అని హరీష్ రావు చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల సామర్థ్యాన్ని 16 లక్షల నుంచి 37 లక్షల ఎకరాల వరకు పెంచామని చెప్పారు. గోదావరి నీళ్లను రెండు రాష్ట్రాలు వాడుకోవాలని చంద్రబాబు అంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications