హయత్‌నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. రోజుకో కథ.. నిందితుడి స్కెచ్ చూస్తే షాక్..!

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన హయత్‌నగర్ బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. నిందితుడు అయితం రవిశేఖర్ పోలీసులకు చిక్కడంతో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. నేరాలు చేయడంలో దిట్టగా ముద్రపడ్డ రవిశేఖర్ పలువురిని మోసగించిన తీరు విస్మయం కలిగిస్తోంది. పూటకో వేషమేసి రోజుకో మోసం చేసే అలవాటున్న సదరు నిందితుడు నేరాలనే ఉపాధిమార్గంగా ఎంచుకోవడం గమనార్హం. మొదటినుంచి కూడా కష్టపడి పనిచేసే అలవాటు లేని రవిశేఖర్.. నేరాలనే వృత్తిగా మలచుకున్నాడు. అలా 65కు పైగా కేసుల్లో నిందితుడిగా మారి పోలీసులకు సవాల్ విసురుతున్నాడు.

 తెలుగు రాష్ట్రాల్లో కలకలం

తెలుగు రాష్ట్రాల్లో కలకలం


హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌ పరిధిలో 21 సంవత్సరాల బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జులై 23వ తేదీ మంగళవారం నాడు మాయమాటలు చెప్పి.. ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పి ఆమెను అపహరించాడు కిడ్నాపర్ అయితం రవిశేఖర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సదరు నిందితుడు మోసాలు చేయడంలో దిట్ట. ఆ క్రమంలో వివిధ నేరాల కింద అతడిపై 65 కేసులు నమోదు కావడం గమనార్హం.

జులై 23వ తేదీ మంగళవారం నాడు సోనిని కిడ్నాప్ చేసిన రవిశేఖర్.. ఆమెను దాదాపు ఎనిమిది రోజుల పాటు కారులోనే తిప్పాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కనీసం ఫోన్ కూడా వాడలేదు. అంతేకాదు టీవీలు చూడలేదు, దినపత్రికలు చదవలేదు. అందుకే అతడికి బయట ఏం జరుగుతుందో తెలియలేదు. అదే క్రమంలో తన గురించి పోలీసులు వెతుకుతున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తాకథనాలు వచ్చినప్పటికీ ఆ విషయం అతడికి చేరలేదు.

అటవీప్రాంతాల్లో, పెట్రోల్ బంకు సమీపంలో బస

అటవీప్రాంతాల్లో, పెట్రోల్ బంకు సమీపంలో బస

కిడ్నాప్ చేసి తనతో పాటు దాదాపు ఎనిమిది రోజులు తిప్పుకున్నప్పటికీ బాధితురాలు సోని ఎందుకుఎదురు తిరగలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కిడ్నాపర్ తెలివిగా వ్యవహరించి ఆమెను నమ్మించినట్లు పోలీసులు చెబుతున్నారు. సోనిని కారులోనే తిప్పుతూ తిరిగిన నిందితుడు లాడ్జీల్లో, వసతిగ‌ృహాల్లో బస చేయలేదు. అలా ఐతే పోలీసులకు ఈజీగా దొరికిపోతాననే డౌట్ కావొచ్చు. అందుకే అటవీ ప్రాంతాల్లో, పెట్రోల్ బంకుల దగ్గర కారులోనే నిద్రించినట్లు పోలీసులకు వెల్లడించాడట.

సోనికి అనుమానం రాకుండా ఆమెకు దుస్తులు కొనివ్వడం.. ఆమె కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో ఉన్నారంటూ నమ్మించడం ద్వారా తెలివిగా వ్యవహరించాడు. సోని అతడి చెరలో ఉన్నన్ని రోజులు ఫోన్ వాడకుండా కవర్ చేశాడు. హయత్‌నగర్‌ నుంచి షాద్‌నగర్‌ మీదుగా కర్నూలు, కడప, ప్రకాశం, నల్గొండ జిల్లాల్లో రవిశేఖర్‌ సంచరించినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబం పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు.

 ఒక్క రోజు మాత్రం తెలిసినవారింట్లో బస

ఒక్క రోజు మాత్రం తెలిసినవారింట్లో బస

ఎనిమిది రోజుల పాటు కారులోనే తిరుగుతూ కారులోనే నిద్రపోయారు. ఒక్కరోజు మాత్రం తెలిసిన వారింట్లో బస చేసినట్లు తెలుస్తోంది. మిగతా ఏడు రోజులు మాత్రం అటవీ ప్రాంతాల్లో, పెట్రోల్ బంక్‌ల సమీపంలో కారులోనే నిద్రించినట్లు పోలీసులకు వివరించాడు నిందితుడు. ఆ సమయంలో కారు డోర్లకు లాక్ వేసేవాడినని పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నాడు. అయితే బాధితురాలు సోనికి తప్పించుకోవాలని ఉన్నా.. తాము ఎక్కడ ఉన్నామో తెలియక మిన్నకుండిపోయినట్లుగా గుర్తించారు పోలీసులు.

 టీవీలు చూడలేదు.. పత్రికలు చదవలేదు.. విషయం తెలియక..!

టీవీలు చూడలేదు.. పత్రికలు చదవలేదు.. విషయం తెలియక..!

సోనిని అద్దంకిలో ఉంచిన రవిశేఖర్ జులై 30వ తేదీన ఉదయం నల్గొండ జిల్లాకు చేరుకున్నాడు. విజిలెన్స్ అధికారినంటూ ఓ ఎరువుల దుకాణం యజమానిని బోల్తా కొట్టించి 80వేల రూపాయల వరకు కాజేశాడు. అదలావుంటే అసలు సోనిని తాను కిడ్నాప్ చేసినట్లు భావించకుండా ఆమెను తన నేరాలకు వాడుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అందుకే పోలీసులు తన గురించి ముమ్మరంగా గాలిస్తున్నారనే విషయం అతడికి తెలియదు. టీవీలు చూడకపోవడం, దినపత్రికలు చదవకపోవడంతోనే అసలు విషయం తెలియక అద్దంకి నుంచి నల్గొండ జిల్లాకు చేరుకుని వ్యాపారిని బెదిరించాడనే విషయం పోలీసులు గుర్తించారు. అంతేకాదు సోనిని కిడ్నాప్ చేసిన అనంతరం కారు నెంబర్ కూడా మార్చడంతో తనను పోలీసులు పట్టుకోలేరనే ధీమాతో ఉన్నట్లు నిర్ధారించారు. నిందితుడు వాడిన కారు కూడా చోరీ చేసిందే కావడం ఇక్కడ ట్విస్ట్.

 పీడీ యాక్ట్ పెట్టే దిశగా కసరత్తు

పీడీ యాక్ట్ పెట్టే దిశగా కసరత్తు

కిడ్నాప్ చేసి ఎనిమిది రోజులు కావడం.. సోని తన ఉద్యోగం ఏమైందంటూ ప్రశ్నించడం.. అదంతా కూడా రవిశేఖర్ తలనొప్పిగా మారింది. ఆ క్రమంలో తన నేరాలకు సోని ఎట్టిపరిస్థితుల్లో సహకరించేలా లేదని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఆమెను వదలించుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఇదివరకు కూడా ఇలాంటి తరహాలో మోసాలకు పాల్పడ్డ నిందితుడు.. బాధితులను ఎక్కువ రోజులు తనతో పాటు తిప్పుకోలేదనే విషయం వెల్లడైంది. అందుకే జులై 30వ తేదీ రాత్రి ఆమెను హైదరాబాద్ బస్సు ఎక్కించినట్లు తెలుస్తోంది. అనంతరం అతడు తిరుపతికి తిరుగు ప్రయాణమైన సందర్భంలో పోలీసులు అటాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి 65 కేసుల్లో నిందితుడైన రవిశేఖర్‌పై పీడీ చట్టం ప్రయోగించి కటకటాల వెనక్కి పంపే దిశగా రాచకొండ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+