హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసు.. అసలు కథ ఇదే.. నిందితుడు ఏమన్నాడంటే..!
హైదరాబాద్ : హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. హైదరాబాద్లో సోనిని కిడ్నాప్ చేసిన దుండగుడు ఏపీకి చెందినవాడు కావడం.. రెండు రాష్ట్రాల్లో తిరుగుతూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరగడం చర్చానీయాంశమైంది. తెలంగాణ పోలీసులకు సవాల్ విసిరినట్లుగా నిందితుడు దాదాపు ఎనిమిది రోజులు చిక్కకుండా పోవడం గమనార్హం. మొత్తానికి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కిడ్నాపర్ ఆటకట్టించారు పోలీసులు. అయితే సదరు నిందితుడు చెప్పిన విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి.

కిడ్నాప్ కేసు అసలు కథ
హైదరాబాద్ హయత్నగర్లో బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏపీకి చెందిన 45 సంవత్సరాల పాత నేరస్థుడు రవిశేఖర్ 21 సంవత్సరాల సోనిని అపహరించడం చర్చానీయాంశమైంది. ఉద్యోగం ఇప్పిస్తానని కల్లిబొల్లి మాటలు చెప్పి సోని కుటుంబాన్ని నమ్మించి చివరకు ఆమెను కిడ్నాప్ చేసి పరారయ్యాడు. ఈ నెల 23వ తేదీన మంగళవారం నాడు కిడ్నాప్ చేసి కారులో పరారైన నిందితుడు చివరకు ఎనిమిది రోజుల తర్వాత 30వ తేదీ మంగళవారం నాడు వదిలేశాడు.
ఈ ఎనిమిది రోజులు ఎక్కడెక్కడ తిరిగాడు.. సోనికి ఏమైనా హాని తలపెట్టాడా.. గుర్తుతెలియని వ్యక్తితో వెళ్లిన సోని అతడిని ఎందుకు ప్రశ్నించలేదు.. అసలు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు.. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు, అనుమానాలు వెంటాడాయి. మరోవైపు పోలీసులు నిఘా పెంచినా నిందితుడి ఆచూకీ దొరకలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తన సమాచారం పోలీసులకు దొరక్కుండా నిందితుడు మొబైల్ ఫోన్ వాడలేదు. అందుకే అతడిని ట్రేస్ చేయడం కుదరలేదనే టాక్ వినిపిస్తోంది.

కిడ్నాప్ అనుకోలేదట.. ఇదో విచిత్రం
ఈ కిడ్నాప్ కేసులో నిందితుడు రవిశేఖర్ వాడిన కారు కూడా చోరీ చేసిందే కావడం గమనార్హం. కారు నెంబర్ కూడా మార్చేసి తిరగడంతో పోలీసులకు దొరక్కుండా పోయాడు. సోనిని కారులోనే ఉంచుతూ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సంచరించాడు. తిరుపతిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ తీసుకొచ్చిన సోనిని ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉంచాడు. అదే క్రమంలో ఆమెను అక్కడే ఉంచి 29వ తేదీ సోమవారం నాడు తెల్లవారుజామున నల్గొండ జిల్లా దామరచర్లకు ఒక్కడే వచ్చాడు. కారు నెంబర్ మార్చి అక్కడ ఎరువుల దుకాణంలో దోపిడీకి పాల్పడి నగదు దోచుకెళ్లాడు.
అదే రోజు తిరిగి అద్దంకి చేరుకున్నాడు. అప్పటికే ఎనిమిది రోజులు కావడం.. సోని ఉద్యోగం గురించి తరచుగా ప్రశ్నించడం.. అలా ఇక తనవల్ల కాదనుకున్నాడు రవిశేఖర్. అదలావుంటే అసలు ఆమెను కిడ్నాప్ చేసినట్లు భావించలేదని చెబుతున్నాడు. అప్పటికే నేరస్థుడిగా ముద్రపడ్డ రవిశేఖర్.. ఆమెను తన సహాయకురాలిగా వాడుకోవాలని పన్నాగం వేశాడు. అయితే సోని తనకు సహకరించబోదని నిర్ణయించుకుని చివరకు ఆమెను వదిలించుకోవాలని చూశాడు.

మొబైల్ లేకుండా జాగ్రత్త.. చివరకు చిక్కాడిలా..!
రవిశేఖర్ ఫోన్ వాడకపోవడం.. బాధితురాలు సోని దగ్గర కూడా మొబైల్ లేకపోవడం అతడికి కలిసొచ్చింది. ఈ కిడ్నాప్ కేసు గురించి మీడియాలో రచ్చరచ్చగా మారినా సదరు నిందితుడు మాత్రం టీవిలు చూడకపోవడం, దినపత్రికలు చదవకపోవడంతో విషయం తెలియలేదు. అందుకే అదే కారులో తిరుగుతూ ధీమాగా ఉన్నాడు. అదలావుంటే సోని తండ్రి కూడా తమ దగ్గరకే వస్తున్నాడంటూ ఆమెను నమ్మించి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే తనను రవిశేఖర్ కిడ్నాప్ చేసినట్లు భావించలేదని సోని చెబుతుండటం గమనార్హం. ఉద్యోగం ఇప్పించే క్రమంలో పనుల మీద తనను తీసుకెళ్లాడాని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
సోనిని తన నేరాలకు వాడుకోవాలని రవిశేఖర్ చూసినప్పటికీ ఆమె సహకరించబోదనే భావనతో చివరకు విడిచిపెట్టాడు. అలా 29వ తేదీ సోమవారం నాడు అద్దంకి బస్ స్టేషన్లో హైదరాబాద్ బస్సు ఎక్కించాడు. అయితే మంగళవారం నాడు మాత్రం రాచకొండ పోలీసులకు అనూహ్యరీతిలో రవిశేఖర్ అడ్డంగా దొరికిపోయాడు. బాధితురాలిని అద్దంకిలో బస్సు ఎక్కించిన తర్వాత తిరుపతి వెళ్లే క్రమంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

30కి పైగా నేరాలు.. పరారీలో ఉంటూ కొత్త మోసాలు
దొంగతనాలు చేయడంతో పాటు మోసాలకు పాల్పడటంలో రవిశేఖర్ దిట్ట. అలా అతడిపై 30కి పైగా కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉంటూ కొత్త కొత్త మోసాలకు పాల్పడటం అతడి నైజం. మే నెలలో ఓ కేసు విచారణకు సంబంధించి తిరువూరు కోర్టులో హాజరుపరచి తీసుకెళుతుండగా విశాఖపట్నంలో పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. అంతేకాదు జనవరి నెలలో కూడా ఇలాగే తప్పించుకున్నాడు. తాడేపల్లి గూడెం పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకున్నాడు. ఏపీతో పాటు తెలంగాణలోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.












Click it and Unblock the Notifications