ఆర్టీసీ రూట్ల ప్రవేటీకరణపైన కోర్టు ఆదేశాలివే..: ప్రొసీడింగ్స్ సమర్పించండి: విచారణ వాయిదా..!
తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణ నిర్ణయం పైన హైకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. గత వారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమవేశమై ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తీర్మానించింది. అదే సమయంలో రూట్లను ప్రయివేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఈ నెల 5వ తేదీ అర్ద్రరాత్రి లోగా కార్మికులు సమ్మె విడిచి..ఉద్యోగాల్లో చేరాలని..లేకుంటే మిగిలిన అయిదు వేల రూట్లను ప్రయివేటీకరిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కానీ, కార్మికులు నామ మాత్రంగా మాత్రమే విధులకు హాజరయ్యారు. ఇదే సమయంలో కేబినెట్ లో 5100 ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణ పైన హైకోర్టులో అత్యవసర పిటీషన్ దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు తాజాగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కేబినెట్ ప్రొసీడింగ్స్ ను సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. దీని పైన కౌంటర్ దాఖలు చేయాలని ఆర్టీసీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
సోమవారం వరకు ప్రైవేటీకరణ నిర్ణయం వద్దు..
తెలంగాణ కేబినెట్ గత వారం టీయస్ఆర్టీసీలోని 5100 బస్సు రూట్లను ప్రవేటీకరించాలని తీసుకున్న నిర్ణయం పైన హైకోర్టు తాజా ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయం పైన ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో అత్యవసర విచారణ పిటీషన్ దాఖలు చేసారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయం అమలు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్దించారు. దీనిని పరిశీలించిన హైకోర్టు 11వ తేదీ వరకు ఆర్టీసీ రూట్ల ప్రవేటీకరణ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది . అదే సమయంలో కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల ప్రొసీడింగ్స్ కోర్టుకు సమర్పించాలని సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ కార్పోరేషన్ కు హైకోర్టు సూచించింది. విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. దీంతో..కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణ పైన ముందుడుగు వేయటానికి అవకాశం లేదు.

అదే రోజు సమ్మె పైనా కీలక నిర్ణయానికి ఛాన్స్..
గురువారం తెలంగాణ హైకోర్టులో టీయస్ఆర్టీసీ సమ్మె..ప్రభుత్వ వైఖరి పైన ఆసక్తి కరంగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించిన అంశాలు కొత్త చర్చకు కారణమయ్యాయి. గతంలో సమర్పించిన వివరాలు..ఇప్పుడు సమర్పించిన నివేదికలకు మధ్య తేడా పైన హైకోర్టు ప్రభుత్వ అధికారులను మందలించింది. దీనికి అధికారులు కోర్టుకు క్షమాపణ చెప్పారు. అదే సమయంలో అసలు ఆర్టీసీ విభజనకు కేంద్రం గుర్తింపు లేదంటూ కేంద్ర తరపు న్యాయవాది కోర్టు ముందు వాదించారు. అయితే సెక్షన్ 3 ప్రకారం తాము ఆర్టీసీని విభజించామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఈ సమయంలో హైకోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. దీని పైన సోమవారం హైకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేస్తుందని కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్.. ప్రభుత్వ కార్యాచరణ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం కీలక సమావేశం ఏర్పాటు చేసారు.












Click it and Unblock the Notifications