క్రిస్మస్ -న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు : హైకోర్టు ఆదేశం : ఓమిక్రాన్ వేళ చర్యల దిశగా..!!
కరోనా ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరుగుతుండటంతో హైకోర్టు కీలక సూచనలు చేసింది. కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38 ఒమైక్రాన్ కేసుల నమోదు అయ్యాయి. ఒమైక్రాన్ కేసులలో తెలంగాణ నాల్గవ స్థానంలో నిలిచింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు విదేశీ రాకపోకలు ఎక్కువగా ఉండటమే వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసారు.
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
పాజిటివ్ వచ్చిన వారికి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు. అయితే, బుధవారం ఒక్క రోజునే 14 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు వైరస్ బాధితుల్లో 6 రిస్క్ దేశాల నుంచి, 31 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి రాగా... మరొకరు కాంటాక్ట్ వ్యక్తి వైరస్ సోకింది. కాంటాక్ట్ వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. వచ్చిన కేసులు ఎక్కువగా టోలిచౌకి, పారామౌంట్ నుంచే ఉన్నారు. ఒమైక్రాన్కు హైదరాబాద్ హాట్ స్పాట్గా నిలుస్తోంది. దీంతో..హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
వేడుకల పైన ఆంక్షలు
ఒమైక్రాన్ వైరస్ తీవ్రత దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలు, క్రిస్మస్ వేడుకలకు ఆంక్షలు విధించాలని న్యాయస్థానం ఆదేశించింది. జనం గుంపులు గుంపులుగా గుమికూడకుండా ఆంక్షలు అమలు చేయాలని నిర్దేశించింది. ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లోగా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్న హైకోర్టు.. ఎయిర్పోర్ట్లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఆ రాష్ట్రాల తరహాలో నిర్ణయాలు తీసుకోవాలంటూ
మహారాష్ట్ర..ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే కోవిడ్ నిబంధనలను విధించారో.. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎయిర్ పోర్ట్లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయలని ధర్మాసనం ఆదేశించింది.