బోనాలు, బక్రీద్కు పటిష్ట భద్రత, ఉన్నతాధికారులతో హోం మంత్రి సమీక్ష
బోనాల జాతర, బక్రీద్ నేపధ్యంలో హైదరాబాద్లో శాంతిభద్రతలను పకడ్బందీగా నిర్వహించాలని పోలీస్ ఉన్నతాధికారులను హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీ, హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాల అధిపతులు, పోలీసు కమిషనర్లు, హైదరాబాద్, వరంగల్ ఐజీలు సమీక్షల్లో పాల్గొన్నారు. బోనాలు, బక్రీద్ సందర్భంగా బందోబస్తు, శాంతి భద్రతల ఏర్పాట్లతోపాటు హోం శాఖ పరిధిలోని విభాగాలలో వివిధ పోస్టుల ఖాళీలపై సమీక్షించారు.
బోనాలు, బక్రీద్కు పటిష్ట బందోబస్ట్ చేయాలని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలుచేయాలని స్పష్టంచేశారు. ఏర్పాట్లకు సంబంధించి ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని కోరారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించి.. వచ్చిన ప్రజలు పాటించేటట్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈద్గాలలో ఈద్-ఉల్-జుహా ప్రార్థన చేసే సమయంలో భౌతిక దూరం పాటించి, మాస్కు విధిగా ధరించాలని, బక్రీద్ సందర్భంగా ఆవులను బలి ఇవ్వకుండా చూడాలని హోం మంత్రి ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. బోనాల ఉత్సవాలను శాంతియుతంగా జరిగేటట్లు చూడడానికి స్థానిక పోలీసులు ఆలయ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకోవాలని హోం మంత్రి ఉన్నత అధికారులను ఆదేశించారు.
హోంశాఖలోని అన్ని విభాగాలలోని వివిధ పోస్టుల ఖాళీ స్థానాలపై చర్చించి సమీక్షించారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను వెంటనే అప్డేట్ చేయాలని, ఖాళీగా ఉన్న స్థానాలపై స్పష్టత ఉండాలని అధికారులను ఆదేశించారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి, డీజీ జైళ్లు రాజీవ్ త్రివేది, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.