రేపిస్ట్ రాజు ఎలా చచ్చాడంటే: ప్రత్యక్షసాక్షులు రైల్వే కీ మెన్లు ఏం చెప్పారంటే.. ఇలా..
గత ఆరు రోజులుగా రేపిస్ట్ రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సిటీలోనే ఉన్నారనే సమాచారంతో అష్టదిగ్బందనం చేశారు. ఎట్టకేలకు రేపిస్ట్ రాజు చిక్కుతారని అంతా అనుకున్నారు. ఆ కీచకుడికి కూడా తెలుసు.. తాను దొరికితే ఏం జరుగుతుందోనని.. అందుకే తనకు తానే బలవన్మరణం పాలయ్యాడు. ఘట్ కేసర్- వరంగల్ ట్రాక్పై రాజు మృతదేహం లభించింది. దీంతో అంతా హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిన్నారికి న్యాయం జరిగిందని అనుకున్నారు. ఇంతకీ రాజు ఎలా చనిపోయాడు.. ఆత్మహత్య ఎలా చేసుకున్నాడనే సందేహాం వస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యక్షసాక్షులు ఏం చెప్పారనే అంశాన్ని ఓ సారి పరిశీలిద్దాం.
ప్రత్యక్ష సాక్షులు రైల్వే కీ మెన్
రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను తెలియజేశారు.ఇద్దరం ఉదయాన్నే డ్యూటీకి ఎక్కామని వారు వివరించారు, ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి పొదల్లోకి పారిపోయాడని వారు చెప్పారు. అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచకుంటూ వచ్చామని, ఆ సమయంలో హైదారాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
ఉదయం 8.40 గంటలు
ఆ తర్వాత వెళ్లి పరిశీలించగా రాజు అనే అనుమానం తమకు వచ్చిందని వివరించారు. ఆ వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రాజు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతని డెడ్ బాడీని కుటుంబసభ్యులు కూడా ధృవీకరించారు. చేతిపై మౌనిక అనే పేరు కూడా ఉంది. చిన్నారి చనిపోయిన ఏడు రోజులకు కీచక నీచుడు రాజుకు కూడా అదేవిధంగా శిక్షపడింది. తనకుతానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.
9వ తేదీన ఘోరం..
చిన్నారిపై అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 9వ తేదీన సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అతడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఎన్ కౌంటర్ చేయాలని ఉరి తీయాలనే బహిరంగంగా డిమాండ్ చేశారు.
పోలీసు బృందాలు..
రాజు కోసం పోలీసు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అతనిని పట్టిస్తే రూ. 10 లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. రాజు ఎలా ఉంటాడో ప్రజలకు తెలియజేశారు. జుట్టుతో ఉన్న రాజు గుండు చేయించుకుంటే ఎలా ఉంటాడో కూడా ఫోటోలు విడుదల చేశారు. హైదరాబాద్ వాసులే కాకుండా.. ఇతర జిల్లాల ప్రజలు కూడా రాజును గుర్తుపట్టేలా బస్సులపై పోస్టర్లు అంటించారు. ఫోటోలు పట్టుకుని ఇతన్ని ఎక్కడైనా చూశారా అంటూ అరా తీస్తున్నారు. ఎవరికైనా, ఎక్కడైనా కనిపిస్తే.. ఆచూకీ చెప్పాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
మంత్రుల పరామర్శ
తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్ ఆలీ, సత్యవతి రాథోడ్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున రూ. 20 లక్షల చెక్కును వారికి అందచేశారు. నిందితుడిని పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అతడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్ వద్దని, నిందితుడు రాజును ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని వారు రోదించారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
కదిలించిన ఘటన
చిన్నారి ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో నేతలు, ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒకడుగు ముందుకేసి చంపేయాల్సిందేనని కామెంట్ చేశారు. ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో రియాక్టయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మంత్రి మల్లారెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఇది చాలా ఘోరం. తప్పకుండా వాడిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. ఎన్ కౌంటర్ చేస్తాం.. విడిచిపెట్టేదే లేదన్నారు. ఫ్యామిలీ వద్దకెళ్లి పరామర్శించడం మాత్రమే కాదు. కుటుంబానికి న్యాయం చేస్తాం అని తెలిపారు. ఆ కుటుంబాన్ని అన్నిరకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తాం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కానీ ఇంతలోనే రాజు పాపం పండింది.
కామాంధుడి ఆకృత్యం
ఆరేళ్ల పాపపై ఓ కామాంధుడు ఆకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి దారుణంగా చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో 9వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు.
రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్గా పని చేసేవాడు. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోననే అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అతని గదిలో ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది.
సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు, స్థానికులు కూడా కంటతడిపెట్టారు. రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంతలో రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను దొరికితే ఏం జరుగుతుందోనని ఊహించి ఉంటాడు. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు.