విమానంలో ‘పిస్తా హౌస్’: సరికొత్త అనుభూతి, హైదరాబాద్లోనే తొలి రెస్టారెంట్
హైదరాబాద్: ప్రముఖ తినుబండారాల కేంద్రం 'పిస్తా హౌస్' అంటే రాజధాని నగరంలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. అలాంటి పిస్తా హౌస్ ఇప్పుడు నగర ఆహార ప్రియులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు సిద్ధమైంది. షామీర్పేటలో విమానంలో తొలి రెస్టారెంట్ను డిసెంబర్ నెలలో ప్రారంభించనుంది.
ఎయిర్బస్-320ని కొనుగోలు చేసిన పిస్తా హౌస్
విమాన రెస్టారెంట్ కోసం ఎయిరిండియా తొలి ఎయిర్బస్-320ని పిస్తా హౌస్ కొనుగోలు చేసింది. విమానంలోనే రెస్టారెంట్ ఓపెన్ చేసి నగర ప్రజలకు సరికొత్త అనుభూతులను అందించాలని.. అందుకు తగినట్లుగా మెరుగులు దిద్దుతోంది. ఇందుకోసం విమానాశ్రయంను తలపించేలా పరిసరాలను మార్చేస్తోంది. రన్ వే, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాస్ స్టైల్లో టికెట్లు వంటి ఏర్పాట్లను చేసింది. విమానంలో 150 సీట్లను ఏర్పాటు చేశారు.
ఆ విమానం కేరళ నుంచి హైదరాబాద్కు వయా ఏపీ
అయితే, విమానం కొనుగోలు చేసిన తర్వాత ఆ విమానాన్ని కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చేందుకు పిస్తా హౌస్ శ్రమించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని అండర్ పాస్ లో ఆ విమానాన్ని తీసుకొస్తుండగా ఇరుక్కుపోయింది. మేదర్మెట్ల పోలీసుల సహకారంతో విమానంను బయటికి తీశారు. ఆ తర్వాత కొరిసపడు అండర్ పాస్ నుంచి విమానంను తరలించారు.
హైదరాబాద్లో 1997లోనే తొలి పిస్తా హౌస్.. ఫుల్ ఫేమస్
కాగా,హైదరాబాద్ నగరంలో పిస్తా హౌస్ రెస్టారెంట్ వ్యాపారాన్ని 1997లో ప్రారంభించింది. శాలిబండలోతన తొలి హోటల్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు నగర వ్యాప్తంగా 32 బ్రాంచీలను ఏర్పాటు చేసింది. అన్ని బ్రాంచీలు కూడా వినియోగదారులతో ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటున్నాయి. పిస్తా హౌస్ రెస్టారెంట్లను వ్యాపారవేత్త మహ్మద్ అబ్దుల్ మజీద్ ఇప్పుడు దుబాయ్, మలేషియా, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి దేశాల్లోనూ ఫుడ్ కోర్టులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పిస్తా హౌస్ తయారు చేసిన బేకరీలు, కన్ఫెక్షనరీలు, హలీంలను.. నార్త్ అమెరికా, గల్ఫ్, సౌత్ ఈస్ట్ ఆసియా, యూరోప్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తుండటం గమనార్హం. ఇప్పుడు విమాన రెస్టారెంట్ను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
భారత్లో తొలి విమాన రెస్టారెంట్ హైదరాబాద్లోనేనా?
హైదరాబాద్లో తొలి విమాన రెస్టారెంట్ ఏర్పాటు చేసింది పిస్తా హౌస్. అయితే, పాట్నాలోని హజిపూర్, హర్యానాలోని గుర్గావ్లో, గుజరాత్లోని వడోదరలో ఇలాంటి రెస్టారెంట్లు ఉండటం గమనార్హం. వడోదరలో ఇటీవలే ఇలాంటి రెస్టారెంట్ ఓపెన్ చేశారు. 102 మందికి ఆతిథ్యం ఇచ్చేలా దీన్ని రూపొందించారు. వెయిటర్స్, సర్వర్లు అంతా ఎయిర్ హోస్టేసెస్, స్టెవర్డ్స్ తరహాలో వస్త్రాలు ధరిస్తారు. వడోదరలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ తరహాలోనే హైదరాబాద్ పిస్తా హౌస్ విమాన రెస్టారెంట్ కూడా అందుబాటులోకి రానుంది. డిసెంబర్ నెలలోనే ఈ రెస్టారెంట్ వినియోగదారులను ఆహ్వానిస్తోంది.