పెరగనున్న మెట్రో రైలు ఛార్జీలు: 15లోగా ప్రయాణికులు అభిప్రాయాలు తెలపాలి
హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణికులకు ఇది చేదువార్తే. ఎందుకంటే.. ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు పెరగ్గా.. త్వరలోనే మెట్రో రైలు ఛార్జీలు కూడా పెరగనున్నాయి. మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ(ఎఫ్ఎఫ్సీ)ని ఏర్పాటు చేసింది. ఛార్జీల పెంపునకు సంబంధించిన అంశాలను ఈ కమిటీ విశ్లేషించి సూచనలు చేయనుంది.

15లోగా మెట్రో ప్రయాణికుల అభిప్రాయాలు తెలపాలి
హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ ప్రసాద్ ఛైర్మన్గా.. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్ బగ్దె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సభ్యులుగా కమిటీని నియమించింది. ప్రస్తుత ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబర్ 15లోగా తెలపాలని కమిటీ ఛైర్మన్ ప్రయాణికులను కోరారు.

ధరల పెంపుపై మెట్రో ప్రయాణికులు మెయిల్ చేయొచ్చు
మెయిల్ ffchmrigmail.com ద్వారా గానీ, తపాలా ద్వారా అయితే ఛైర్మన్, షేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైలు భవన్, బేగంపేట,500003 చిరునామాకు పంపాల్సిందిగా ఆయన కోరారు. కాగా, మెట్రో రైలు చట్టం ప్రకారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్(ఎంఆర్ఏ)కు మొదటిసారి మాత్రమే ఛార్జీలు పెంచే అధికారం ఉంటుంది. సాధారణంగా మెట్రోని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తుంటాయి కాబట్టి వారే ఎంఆర్ఏగా ఉంటారు.

త్వరలోనే మెట్రో ఛార్జీలు పెంచే అవకాశం
హైదరాబాద్ లో మెట్రో పీపీపీ విధానంలో చేపట్టారు. ఇక్కడ మెట్రోని నిర్మించి నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ హైదరాబాద్.. ఎంఆర్ఏగా ఉంది. ఈ క్రమంలో ఎల్ అండ్ టీ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆరంభంలో మాత్రమే మెట్రో ఛార్జీలను పెంచే అధికారం ఉంది. సవరించాలంటే కేంద్రం నియమించే షేర్ ఫిక్సేషన్ కమిటీనే చేయాలి. షేర్ ఫిక్సేషన్ కమిటీని నియమించాలని కేంద్రాన్ని కోరడంతో సెప్టెంబర్ నెలలో కమిటీ ఏర్పాటు చేసింది. అయితే, ఛార్జీలు ఎంత పెంచాలనేది ఇంకా నిర్ణయించలేదు. కసరత్తులు పూర్తయిన తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ తమ ప్రతిపాదనలను కమిటీకి అందజేయనుందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications