హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నివాసంపై దాడి, ధ్వంసం: ఐదుగురు అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆలిండియా మజ్లిస్ ఇ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అధికారిక నివాసంపై మంగళవారం దాడి జరిగింది. హిందూ సేనకు చెందిన సభ్యులుగా అనుమానిస్తున్న కొందరు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
34 అశోకా రోడ్లోని అసదుద్దీన్ ఒవైసీ నివాసానికి వచ్చిన ఏడు ఎనిమిది మంది దుండగులు నివాసం ముందున్న నేమ్ ప్లేట్ను పగలగొట్టారు. విద్యుత్ దీపాలను ధ్వంసం చేశారు. కిటికీలను కూడా పగలగొట్టారు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో అసదుద్దీన్ ఒవైసీ ఆ బంగ్లాలో లేరు.
కొందరు దుండగులు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అసదుద్దీన్ నివాసంపై ఇటుకలతో దాడి చేశారని ఆయన బంగ్లా కేర్ టేకర్ దీప మీడియాకు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కాసేపట్లోనే ఈ దాడికి పాల్పడిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని వారిని ప్రశ్నిస్తున్నారు. ఏ సంస్థకు చెందినవారని వారిని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూపీలో అసదుద్దీన్ ఒవైసీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.