కరోనా: ఒకే ఇంట్లో 11 మందికి వైరస్.. హైదరాబాద్ నిమ్స్లో నర్స్కు.. 2నెలల పసిగుడ్డునూ వదల్లేదు..
తెలంగాణలో కొవిడ్-19 కేసుల సంఖ్య వెయ్యి దిశగా వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి నాటికి 809 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 18 మంది చనిపోయారు. ఒక్కరోజులోనే 43 కొత్త కేసులు రికార్డుకాగా అందులో రెండు నెలల పసిగుడ్డు నుంచి వైద్య సేవలందించే నర్సు దాకా ఉన్నారు. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్ గా ఉన్న షాపూర్నగర్ గాజులరామారంలోని చంద్రగిరినగర్ కాలనీలో ఇటీవల ఓ వృద్ధుడు కొవిడ్-19తో మరణించగా, అతని నుంచి కుటుంబలోని 11 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వాళ్లందరినీ క్వారంటైన్ కు తరలించారు.
ప్రఖ్యాత నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రిలోనూ కరోనా కలకలం సృష్టించింది. అక్కడ పనిచేస్తోన్న స్టాఫ్ నర్స్, మరో మహిళా సమాయకురాలు వైరస్ బారినపడ్డారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొంది, చనిపోయిన ఓ వృద్ధుడు కరోనా పాజిటివ్ గా తేలడంతో.. స్టాఫ్ అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు.
అందులో నర్స్, నాలుగో తరగతి ఉద్యోగిని పాజిటివ్ గా తేలారు. అయితే, 15 రోజుల కింటే సదరు నర్సు దగ్గు, జలుబుతో బాధపడగా, అప్పుడు కరోనా నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమెను గాంధీకి తరలించారు. నర్సు కుటుంబాన్ని, నాలుగో తరగతి ఉద్యోగినితోపాటు ఆమె కుటుంబాన్ని క్వారంటైన్ లో ఉంచారు. వాళ్ల చుట్టుపక్కల ఏరియాల్లో పకడ్బందీ గా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Recommended Video
మరోవైపు, నీలోఫర్ ఆస్పత్రిలో రెండు నెలల బాబుకు కూడా వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. నారాయణపేట జిల్లాకు చెందిన ఆ బాలుడికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఈనెల 15న మహబూబ్ నగర్ పెద్దాసుపత్రికి తీసుకెళ్లగా, అక్కణ్నుంచి హైదరాబాద్ నీలోఫర్ రిఫర్ చేశారు. బాలుడికి న్యుమోనియా ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు.. కరోనా పరీక్షలు కూడా చేయించగా పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాబుకు చికిత్స చేసిన డాక్టర్లు, నర్సులు, సిబ్బంది కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.