బండి సంజయ్కి పోలీసులు షాక్.. నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరణ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు పోలీసులు షాక్ ఇచ్చారు. రేపు (సోమవారం ) బీజేపీ నేతలు చేపట్టిన ఒక్కరోజు నిరుద్యోగ దీక్షపై అంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసీఆర్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలు నిషేదం అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు పిలుపు నిచ్చారు. అందుకు తగ్గట్టుగా కమలం శ్రేణులు ఇందిరా పార్కు వద్ద దీక్షకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిరుద్యోగ దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కూడా బీజేపీ నేతలు కోరారు. అయితే పోలీసులు వారి వినతిని తిరస్కరించారు. కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు.

జనవరి 2వరకు ఆంక్షలు
ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించాలని రాష్ట్ర హైకోర్టు.. కేసీఆర్ ప్రభుత్వానికి సూచించింది. దీంతో తెలంగాణలో వచ్చే ఏడాది జనవరి 2వ తేది వరకు ఆంక్షలను విధిస్తున్నట్లు సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. బహిరంగ సభలు, ర్యాలీలు, పెద్ద ఎత్తున జనం గుమికూడడంపై కరోనా ఆంక్షలను విధించింది. నిబంధనల ప్రకారం బీజేపీ దీక్షకి అనుమతి కుదరదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో బండి సంజయ్ దీక్షపై తీవ్ర సందిగ్దత నెలకొంది.

నిరుద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష..
మరోవైపు బండి సంజయ్ తలపెట్టిన బండి సంజయ్ దీక్షపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు చేసేది నిరుద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష అని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతను నిలువునా ముంచిందన్నారు. బండి సంజయ్కి దమ్ముంటే తన దీక్షను ఇందిరా పార్కులో కాకుండా .. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేయాలని సవాల్ విసిరారు..

బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి..
భాగ్యనగరానికి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది మోదీ ప్రభుత్వం కాదా.. అని ప్రశ్నించారు కేటీఆర్. బీజేపీ నేతల కపట ప్రేమను చూసి అవకాశవాదమే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటుందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువతను రెచ్చగొట్టి బీజేపీ తన పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజకీయ నిరుద్యోగంతో బీజేపీ నేతలు దీక్షకు దిగుతున్నారని.. ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలని కేటీఆర్ సూచించారు..












Click it and Unblock the Notifications