బీజేపీ నేతల హవాలా: రూ.1కోటి పట్టివేత -వీఐపీల పేర్లు వెల్లడించిన సీపీ -దుబ్బాకకు తరలిస్తుండగా
అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దుబ్బాక ఉప ఎన్నికలో కరెన్సీ ప్రవాహం జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్థానికంగా లక్షల కొద్దీ నగదు పట్టుపడగా, తాజాగా ఆదివారం హైదరాబాద్ నుంచి తరలిస్తోన్న రూ.1కోటిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు అరెస్టయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు చెప్పిన వివరాలివి..

బేగంపేట ఫ్లై ఓవర్ సమీపంలో..
దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశామని, ఈ క్రమంలో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.1 కోటి నగదు పట్టుకున్నారని సీపీ అంజనీకుమార్ చెప్పారు. బేగంపేట ఫ్లై ఓవర్ సమీపంలో డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ డబ్బుకు దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధం ఉందని తేలిందని, హవాలా డబ్బుతో పట్టుపడిన వ్యక్తుల్లో సురభి శ్రీనివాస్ ఒకరి, ఆయన.. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు స్వయాన బావమరిది అని సీపీ తెలిపారు.

మాజీ ఎంపీ వివేక్ కంపెనీ ద్వారా..
బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ మేనేజర్ నుంచి ఆ డబ్బును తీసుకుని దుబ్బాక వెళుతున్నట్టు వెల్లడైందని, విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కు చెందినదని అంజనీ కుమార్ వివరించారు. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇటీవలే సిద్ధిపేటలో రఘునందన్ మామ, ఇతర బంధువుల నివాసాల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

సెల్ ఫోన్లో కీలక ఆధారాలు..
హవాలా డబ్బుల తరలింపు ఘటనలో ఓ ఇన్నోవా వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ వెల్లడించారు. సెల్ ఫోన్ లో కీలక ఆధారాలు ఉన్నాయని, సురభి శ్రీనివాసరావుతోపాటు కారు డ్రైవర్ రవికుమార్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారానికి ఆదివారంతో తెరపడింది. మంగళవారం ఇక్కడ పోలింగ్ జరగనుంది.












Click it and Unblock the Notifications