హైదరాబాద్ జువెల్లరీ వ్యాపారికి ఈడీ షాక్: రూ. 130 కోట్ల ఆస్తులు జప్తు, మొత్తం 200 కోట్లపైనే
హైదరాబాద్: నగరంలోని ముసిద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొరఢా ఝళిపించింది. ఆ సంస్థకు చెందిన 130.57 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్ విక్రయాలకు పాల్పడిందని తేలింది.
ఈ క్రమంలోనే ఈడీ ఆ సంస్థ ఆస్తులను జప్తు చేసింది. ఈ మొత్తంలో 41 స్థిరాస్తులు, బంగారు ఆభరణాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి అనుబంధంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. కాగా, గతంలో ఇదే కేసుకు సంబంధించి 82.11 కోట్ల విలువైన 145 కిలోల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది.
దర్యాప్తులో, ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్, ముసద్దిలాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్.. 2016, నవంబర్ 8 తర్వాత వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో రూ 500, రూ. 1000 డీమోనిటైజ్ చేసిన నోట్లను రూ. 111 కోట్ల మేర జమ చేసినట్లు తెలిపింది.
పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన వెంటనే, నవంబర్ 8, 2016న, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి మధ్య బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి సుమారు 6000 మంది కల్పిత కస్టమర్లు తమ షోరూమ్లను సందర్శించినట్లు చూపించే నకిలీ నగదు రశీదులు, అమ్మకపు ఇన్వాయిస్లను వారు సేకరించారు' అని ఒక ఈడీ ప్రకటనలో తెలిపింది.
మనీలాండరింగ్ నివారణ చట్టం, 2002 (పిఎంఎల్ఎ) కింద ఈడీ దర్యాప్తులో కైలాష్ చంద్ గుప్తా, అతని కుమారులు అతని చార్టర్డ్ అకౌంటెంట్ సంజయ్ సర్దాతో కలిసి పెద్ద నగదు మొత్తాలను సమర్థించుకోవడానికి కల్పిత ఆదాయ వనరులను, కల్పిత ఇన్వాయిస్లను సృష్టించారని వెల్లడించారు. కాగా, ఈడీ ఈ కేసులో దర్యాప్తును మరింత లోతుగా చేపడుతోంది.