బాలల హక్కులనేత అచ్యుత రావు మృతి.. 8రోజులు కరోనాతో పోరాడి తుదిశ్వాస..
రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ కాటేస్తోంది. బాలల హక్కుల ఉద్యమకారుడిగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన అచ్యుత రావు బుధవారం కొవిడ్ వ్యాధి కారణంగా చనిపోయారు. కరోనా పాజిటివ్ పేషెంట్ గా హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఎనిమిది రోజుల పాటు వైరస్ తో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 58 ఏళ్లు. అచ్యుత రావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపాలు తెలిపారు.
బాలల హక్కుల సంఘం పేరుతో ఎన్జీవో స్థాపించిన అచ్యుతరావు.. గడిచిన 30 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పనిచేశారు. ఏమూలన చిన్నపిల్లలకు సమస్యలు ఎదురైనా అక్కడ ప్రత్యక్షమై సమస్యలపై పోరాడేవారు. అచ్యుతరావు సోదరుడైన ప్రముఖ కార్టూనిస్ట్ ఈనాడు శ్రీధర్ కూడా కరోనా బారినపడినా, కోలుకోగలిగారు.
కరోనాపై జగన్ చెప్పినట్లే జరుగుతోంది.. అంబటి రాంబాబుకూ పాజిటివ్.. చికిత్సలపై టీడీపీ విమర్శలు
బాలల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అచ్యుత రావు అంటూ హక్కుల నేత మరణం పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురూ హక్కుల నేత మరణంపై విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో డిశ్చార్జి రేటు మెరుగ్గా ఉన్నప్పటికీ కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం కలవరపెడుతున్నది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 47,705గా ఉంది. మొత్తం 429 మంది కరోనాకు బలైపోయారు.