తొలి వ్యాక్సినేషన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటెల రాజేందర్, ఎందుకంటే?
హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ప్రజల్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ పట్ల నమ్మకం పెంచేందుకు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తానే తీసుకుంటానని రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా కొత్త స్ట్రెయిన్తో భయం లేదని, బర్డ్ ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని తెలిపారు.
ఎన్నికల సిబ్బందికి కరోనా టీకా ఇవ్వండి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం
బర్డ్ ఫ్లూ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగంలోని తొలి, రెండో అంతస్తుల్లో పూర్తి చేసుకున్న నిర్మాణాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించలేమని అన్నారు.
ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ కింద రూ. 1200 కోట్లు, మొత్తం వైద్య రంగంపై రూ. 7500 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. నిమ్స్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పిన ఈటెల రాజేందర్.. రూ. 450 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
జనవరి 11న ముఖ్యమంత్రితో జరగనున్న సమావేశంలో వైద్యారోగ్య రంగంపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. వైద్య రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో రెండో దశ డ్రైరన్ విజయవంతమైందని, టీకా ఎప్పుడు పంపినా వ్యాక్సినేషన్కు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటెల తెలిపారు.
రోజుకు 10 లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. కాగా, హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన విషయ తెలిసిందే.
కాగా, తెలంగాణలో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 31,187 కరోనా పరీక్షలను నిర్వహించగా.. కొత్తగా 298 పాజిటివ్ కేసులు నమోదు చేశారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,433కి చేరింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం వెల్లడించింది.
గురువారం కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1563కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,83,048కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4822 కరోనా కేసులున్నాయి.