యోగి ఆదిత్యనాథ్పై నిప్పులు చెరిగిన అసదుద్దీన్... ఏమన్నారో తెలుసా?
Recommended Video
తెలంగాణలో ఎన్నికలు జరిగేందుకు సమయం దగ్గరపడుతున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఇప్పటికే జాతీయ అగ్రనేతలు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తూ బహిరంగ సభల్లో మాటల వేడిని పెంచుతున్నారు. ఆదివారం తెలంగాణలో పర్యటించిన ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఓవైసీ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. యోగీ మాటలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఓవైసీ సోదరులు.
నన్ను హైదరాబాద్ విడిచి పొమ్మనే అధికారం ఎవరికీ లేదు
ఆదివారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బీజేపీ తరపున తాండూరు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజాం రాజు ఎలాగైతే దేశం విడిచి వెళ్లిపోయారో.... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్ ఓవైసీ కూడా హైదరాబాద్ను వీడి వెళ్లాల్సిందే అని వ్యాఖ్యానించారు. అయితే యోగీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అసదుద్దీన్. భారత దేశం తన తండ్రి దేశం అంటూ ప్రాఫెట్ ఆడంను ఉద్దేశించి చెప్పారు అసదుద్దీన్. తన మత విశ్వాసం ప్రకారం ప్రాఫెట్ ఆడం పరలోకం నుంచి భూమిపైకి వచ్చిన సమయంలో ఆయన భారతదేశానికి వచ్చారని అసదుద్దీన్ చెప్పారు. అలాంటప్పుడు తానెందుకు హైదరాబాద్ వీడి వెళ్లాలని ప్రశ్నించారు. తనను ఎవరూ హైదరాబాద్ నుంచి పంపించలేరని అన్నారు అసదుద్దీన్.
నిజాం రాజు పారిపోలేదు..చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ముందు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాదును వదిలి పారిపోలేదన్నారు. ఆయన్ను రాజ్ప్రముఖ్గా నాటి ప్రభుత్వం నియమించిందని గుర్తు చేశారు. ఇండియా చైనాల మధ్య యుద్ధం జరిగిన సమయంలో నిజాం రాజు భారత్కు తన వద్ద ఉన్న బంగారం ఇచ్చారని ఓవైసీ చెప్పారు. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలకు తాను బెదిరేవాడిని కాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు యోగీ నోటి నుంచి మాత్రమే వచ్చారు. అయితే ఈ వ్యాఖ్యల చేయడానికి వెనక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని ఓవైసీ ధ్వజమెత్తారు.
మా వెయ్యి తరాల వారు హైదరాబాదులోనే ఉంటారు
యోగీ ఆదిత్యనాథ్ ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడాలని ఓవైసీ అన్నారు. తాను నిర్వర్తిస్తున్న పదవి మరిచి మాట్లాడటం సరికాదన్నారు. ఉత్తర్ ప్రదేశ్లో మెదడువాపు వ్యాధి వచ్చి ఏటా 150 మంది చిన్నారులు మృతి చెందుతున్నారని ముందు దానిపై యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించాలని ఓవైసీ సూచించారు. ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ విడిచి పారిపోయేది తాము కాదన్నారు. వెయ్యి తరాల వారు ఇక్కడ నివసిస్తారని హైదరాబాద్ విడిచి వెళ్లిపొమ్మని చెప్పే అర్హత దమ్ము ఎవరికీ లేదని అక్బరుద్దీన్ చెప్పారు.