హైదరాబాద్లో ఇండియన్ రేసింగ్ లీగ్, ప్రమాదంలో గాయపడ్డ మహిళా రేసర్
హైదరాబాద్ నడిబొడ్డున ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న సాగరతీరాన ప్రారంభమైన ఈవెంట్ రెండు రోజులు జరగనుంది. తర్వాత ఫైనల్ రౌండ్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఈ లీగ్లో ఆరు జట్లు బరిలో ఉన్నాయి. ప్రతి జట్టుకు నలుగురు చొప్పున ఇండియా, ఫారిన్కు చెందిన మొత్తం 24 మంది రేసర్లు పోటీ పడుతున్నారు. గంటకు దాదాపు 240 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తున్నారు.
2.7 కిలోమీటర్ల ట్రాక్
లుంబినీ పార్క్, హుస్సేన్ సాగర్, ఐమాక్స్ థియేటర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ నుంచి తిరిగి లుంబినీ పార్క్ మీదుగా 2.7 కిలోమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేశారు. ట్రాక్ చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీ నుంచి చూసేందుకు ఏర్పాటు చేశారు. దేశంలో తొలి రేసింగ్ లీగ్ ఇది కాగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్ లైవ్ టెలీకాస్ట్ చేస్తోంది. తొలి ఎడిషన్లో హైదరాబాద్ బ్లాక్బర్డ్స్, స్పీడ్ డెమోస్ ఢిల్లీ, బెంగళూరు స్పీడ్స్టర్స్, చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్, గాడ్స్పిన్ కొచ్చి అనే జట్లు పోటీలో ఉన్నాయి. ప్రతి జట్టులో ఓ మహిళ సహా నలుగురు రేసర్లు ఉన్నారు. లీగ్ నాలుగు రౌండ్లలో జరుగుతుంది.
హైదరాబాద్ ఆతిథ్యం
తొలి, చివరి రౌండ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. రెండు, మూడో రౌండ్లు చెన్నైలో జరగనుంది. డిసెంబర్ 10,11వ తేదీల్లో సిటీలో చివరి, ఫైనల్ రౌండ్ పోటీలు జరుగుతాయి. చెన్నైలో సపరేట్ ఇంటర్నేషనల్ సర్య్కూట్ ఉంది. హైదరాబాద్లో దారిలోనే రేసు కోసం ప్రత్యేకంగా రోడ్డు వేశారు. అందుకే స్ట్రీట్ సర్క్యూట్ అంటారు. ఐఆర్ఎల్లో నాలుగు రౌండ్లు ప్రతీ వీకెండ్లో నిర్వహిస్తారు. ప్రతి రౌండ్లో క్వాలిఫికేషన్స్, రెండు స్ప్రింట్లు, ఫీచర్ రేసులు ఉంటాయి.
రేసులో ప్రమాదం
ఇవాళ్టి రేసులో ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ఓ మహిళా రేసర్ గాయపడ్డారు. ఎన్టీఆర్ మార్గ్ రేసింగ్ సర్క్యూట్లో కార్లు దూసుకుపోతున్నాయి. చెన్నై టర్బో రైడర్స్ టీమ్ కు చెందిన కారును గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొట్టింది. గాయపడిన మహిళా రేసర్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.