ఒకే దెబ్బకు కేసీఆర్, జగన్లను చెడామడా -మహిళా దినోత్సవాన ys sharmila సంచలన ప్రసంగం
ఆకాశంలో సగంగా ఉన్నప్పటికీ, సొంత ఆశయాలు, సొంత కలలకు ప్రాధాన్యం ఇవ్వలేక, సొంత కుటుంబీకులు, ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం అందక మహిళలు అరిగోస పడుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను గెలిపించడానికి ప్రతి మహిళ చాలా సార్లు ఓడిపోతున్నదని, చాలా మంది మహిళల వ్యవధలు గుండె తరుక్కుపోయేలా ఉంటాయని చెప్పారు. సోమవారం (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె కీలక ప్రసంగం చేశారు.

ధీర వనితలకు సత్కారం..
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాట్లలో తలమునకలైన వైఎస్ షర్మిల.. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో గొప్ప సేవలు అందిస్తోన్న ధీర వనితలను ప్రత్యేకంగా కలుసుకున్నారు. వారితో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకొన్నారు. మహిళాలోకానికే గర్వకారణమైన ఆ వ్యక్తులను సత్కరించారు. ఈ క్రమంలో షర్మిల మాట్లాడుతూ.. మహిళల కుటుంబ, సామాజిక సమస్యలపై మాట్లాడారు. షర్మిల సొంతగా పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని వైసీపీ అధికారికంగా ప్రకటించడం, తన త్యాగాలకు సరైన గుర్తింపు దక్కలేదని దగ్గరి వ్యక్తుల దగ్గర వాపోయినట్లు వార్తలు వచ్చిన దరిమిలా, కుటుంబపరంగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రస్తావిస్తూ పరోక్షంగా వైఎస్ జగన్పై, తెలంగాణ సమాజంలో మహిళల పరిస్థితిని వివరిస్తూ సీఎం కేసీఆర్పై నేరుగా ప్రశ్నలు సంధించారు. షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే..

కిరీటాలు వద్దు.. త్యాగాన్ని గుర్తించండి..
''మహిళలు కనీసం ఒక్కరోజైనా తమ స్నేహితులతో కలిసి కాసేపైనా బయటికి వెళ్లాలనుకుంటే.. ఆ కొద్ది సమయంలో ఇంట్లో వాళ్లకు ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే వెళ్లాలన్న ఆలోచననే మానుకుంటుంది. కానీ ఈ త్యాగాన్ని ఎవరూ గుర్తించరు. కుటుంబం కోసం చేసే పనులకు కిరీటాలు పెట్టాలని కాదుగానీ, కనీసం అయినవాళ్లయినా త్యాగాన్ని గుర్తించాలని ప్రతి మహిళా కోరుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. ఒక చెల్లిగా, తల్లిగా, భార్యగా మన మీద ఆధారపడ్డ కుటుంబీకులను నిత్యం ఇంట్లో గెలిపిస్తూ, బయట కూడా వారి గెలుపునకు మనం తోడ్పాటు అందిస్తాం. అలా వాళ్లను గెలిపించడానికి మనం చాలా సార్లు ఓడిపోతుంటాం..

సొంత ఇంట్లోనే గౌరవం లేదు..
మహిళలమైన మన అభిప్రాయాలకు కించిత్ విలువ కూడా లేదు. చాలా మందికి సొంత ఇళ్లలోనే గౌరవం లేదు. ఇవన్నీ తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఆడవాళ్ల పట్ల ఎందుకింత చులకన భావం? మరి మనం ఏం చేయాలి? అని ఆలోచించినప్పుడు, మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడమే అన్యాయాలకు మూల కారణం అనిపిస్తుంది. ఏరోజైతే మనల్ని మనం గౌరవించుకుంటామో, కుటుంబీకులూ, చుట్టుపక్కలవాళ్లూ గౌరవిస్తారు. ముందు మనలో మార్పు వస్తే తప్ప సమాజంలో మార్పును చూడలేం. ఒక స్త్రీ అనుకుంటే మారని విషయమంటూ, సాధించలేనిదంటూ ఉండదు. మార్పుకు నాందే మహిళ. స్త్రీ శక్తి ఏకమైతే తలవంచని పర్వతం ఉంటుందా? కనుక నిలబదాం.. ముందుగా మన కోసం మనం నిలబడదాం.. సమాజం కోసం మనం నిలబడదాం. సమాజం అంటే..

ప్రత్యేక రాష్ట్రంలో ఘోర అవమానం..
రాజకీయ చైతన్యానికి అడ్డాగా ఉన్న తెలంగాణ గడ్డలో.. తెలంగాణ సమాజంలో ఇవాళ మహిల పాత్ర ఏంటి? మహిళల ప్రాతినిధ్యం ఎంత? తాము ఎవరీకీ తక్కువ కాదని తెలంగాణ మహిళలు చరిత్ర పొడవునా నిరూపించుకున్నారు. రాణి రుద్రమదేవి మొదలు, రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన ధీర మహిళలను గురించి విన్నాం. తెలంగాణ ఉద్యమంలో మహిళలు అగ్రభాగాన నిలబడి పోరాడటాన్ని చూశాం. అసమానతల మీద పోరాటం చేసి, గెలిచి సాధించుకున్న రాష్ట్రంలో నిజానికి అసమానతలు ఉండరాదు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో మహిళలకు దక్కిన ప్రాధాన్యం ఎంత? తెలంగాణలో మహిళలకు తీవ్రంగా అన్యాయం జరుగుతోంది. మహిళల విషయంలో ప్రత్యేక రాష్టం ఘోరంగా విఫలమైంది. అదే..

కేసీఆర్ సమాధానం చెప్పాలి..
గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు ఎంతో మంది మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో మహిళకు ఒక్క మంత్రి పదవి రావడానికే ఐదేళ్లకుపైగా పట్టింది. జనాభాలో సగానికి పైగా మహిళలే ఉన్నప్పుడు.. మహిళలకు ప్రాతినిధ్య వహించే మహిళలే లేకపోతే ఎలా? మరి మహిళల సమస్యలు ఎలా అర్థమవుతాయి? వాటి పరిష్కారాలకు ఆలోచనలు ఎలా వస్తాయి? ఆ తపన ఎక్కన్నుంచి వస్తుంది? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పాలకులు సమాధానం చెప్పాలి. చట్టసభల నుంచి సమాన ఉద్యోగావకాశాల దాకా, సంక్షేమ కార్యక్రమాల నుంచి సమాజంలో గుర్తింపు దాకా మహిళలకు కచ్చితంగా నిర్దిష్టమైన కోటా ఉండాల్సిందే. అందుకోసం నేను నిలబడతాను. నిలబడమే కాదు, కొట్లాడుతాను కూడా. ఇవాళ్టి నుంచి నేను చేయబోయే ప్రతి ఆలోచనలో, తలపెట్టబోయే ప్రతి పనిలో, చేపట్టబోయే ప్రతి ఆశయంలో మహిళలకు తగిన ప్రాధాన్యం, ప్రాతినిధ్య కల్పిస్తానని మాటిస్తున్నాను. చివరిగా మరోసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'' అని వైఎస్ షర్మిల అన్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications