హైదరాబాద్ మెట్రోకు అంతరాయం.. ఆ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు..
హైదరాబాద్లోని అమీర్-రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో బుధవారం ఉదయం 9గంటల నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 9 మెట్రో ట్రైన్స్ పట్టాల పైనే నిలిచిపోయినట్టు సమాచారం. దీంతో అమీర్పేట్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రోజూ లాగే మెట్రో స్టేషన్కు చేరుకున్న ఎంతోమంది ఐటీ ఉద్యోగులు అసహనంతో వెనుదిరిగారు.
అయితే అధికారులు వెంటనే లోపాలను సరిచేయడంతో ప్రస్తుతం రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ సాంకేతిక సమస్యలతో మెట్రో రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో విద్యుత్ వెైర్లు తెగిపడి, మరికొన్ని సందర్భాల్లో విద్యుత్ వైర్లపై ఫ్లెక్సీలు పడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇదిలా ఉంటే, జేబీఎస్-ఎంజీబీస్ మెట్రో సేవలు సంక్రాంతికి ముందే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 11కి.మీ పొడవైన ఈ మార్గంలో ఇప్పటికే దాదాపుగా అన్ని పనులు పూర్తి కాగా.. ప్రస్తుతం ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి నిర్వహిస్తున్న ట్రయల్ రన్స్పై అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ట్రయల్ రన్లో భాగంగా మొత్తం 17 రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు.
45 రోజుల్లో ఇవన్నీ పూర్తి కానున్నాయి. చివరలో మూడు రోజులు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) ట్రయల్ రన్స్ను పరీక్షిస్తుంది. ఆ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే
దీనిపై సంబంధిత సంస్థలకు,ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నారు.
ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే నగరంలో మెట్రో 67కి.మీ మేర అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లేందుకు జేబీఎస్,ఎంజీబీఎస్ వెళ్లే ప్రయాణికులకు ఈ మెట్రో సేవలు ఉపయోగపడనున్నాయి. దేశ రాజధానిలో ప్రస్తుతం 200కి.మీ మేర మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉండటం విశేషం.












Click it and Unblock the Notifications