తెలంగాణను విమర్శించడం కేంద్రానికి తగదు.!దేశ ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు రావాలన్న కల్వకుంట్ల కవిత.!
హైదరాబాద్: దేశంలో ఉన్న ప్రధాన సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, మతతత్వాన్ని సమూలంగా రూపుమాపితే, స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యేలేపు భారతదేశం, ప్రపంచంలో నంబర్ వన్ శక్తిగా ఎదిగే ఆస్కారం ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ఉచితాలంటూ కేంద్రం విమర్శించడం సరైంది కాదన్నారు. పేదలు అభివృద్ధి చెందాలంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
అంతే కాకుండా అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే పథకాలపై కేంద్రం విమర్శలు చేయడం సరైంది కాదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సీఎం చంద్రశేఖర్ రావు తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఏ విధంగా మార్చాలనే అంశంపై దేశ పౌరులందరూ ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
దేశ అభ్యున్నతి కోసం మనమంతా పునరంకితమవ్వాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎంపీ కే కేశవరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరుల పాల్గొన్నారు.