పవన్ కాదు పోసానియే సైకో.. ప్రెస్క్లబ్ వద్ద ఉద్రిక్తత, జనసేన యూత్ నేతల అరెస్ట్
పవన్ కల్యాణ్ వర్సెస్ పోసాని కృష్ణమురళి అటాక్ - కౌంటర్ అటాక్ కొనసాగుతోంది. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోసాని ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్పై కామెంట్లు చేయడంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. దీంతో ప్రెస్క్లబ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోసాని ప్రెస్మీట్ కొనసాగుతుండగానే పవన్ కల్యాణ్ అభిమానులు ప్రెస్క్లబ్ వద్దకు భారీగా చేరుకున్నారు. పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అప్రమత్తమైన పోలీసులు ప్రెస్ క్లబ్ వద్ద భారీగా మోహరించారు. పలువురు పవన్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ స్టేట్ జనసేన యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. ఆయనతో పాటు పలువురిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పవన్ కల్యాణ్పై పోసాని కృష్ణ మురళి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరికునేది లేదని లక్ష్మణ్ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ సైకో కాదని, పోసానినే సైకో అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. నటుడు పోసాని కృష్ణమురళి అదేరీతిలో ధ్వజమెత్తారు. తనకు వేల సంఖ్యలో ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్నాయని మీడియా ముందుకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతుండగా ఓ కాల్ వచ్చిన విషయాన్ని కూడా అందరికీ చూపించారు. పవన్ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నందునే తాను స్పందించాల్సి వచ్చిందని స్పష్టత ఇచ్చారు. ఐదారు కిలోమీటర్లు కూడా నడవలేని పవన్ కల్యాణ్, పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచిన జగన్ తో పోల్చుకోవడం తనకు నచ్చలేదని పోసాని అన్నారు. తాను జగన్ అభిమానినని, ఆయనను ఎవరేమన్నా భరించలేనని పోసాని స్పష్టం చేశారు.
గతంలో పవన్ కల్యాణ్ కు, తనకు మధ్య జరిగిన ఓ గొడవను పోసాని మీడియాకు వివరించారు. తాను సాధారణంగా సాయంత్రం 6 గంటలకే షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిపోతానని, కానీ ఓసారి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో రాత్రి షెడ్యూల్ పెట్టారని వెల్లడించారు. రాత్రి 9 గంటలు అవుతున్నా గానీ పవన్ రాలేదని, దాంతో తాను ఇంటికి వెళ్లిపోయానని తెలిపారు. రాత్రి 10.30 గంటల సమయంలో భోజనం చేస్తుండగా పవన్ ఫోన్ చేసి తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోసాని ప్రెస్ మీట్ పెట్టగా.. జనసేన కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది.