కరోనా ఎఫెక్ట్ : గాంధీలో వద్దు.. ఆ వార్డును తక్షణమే తరలించాలని జూడాల డిమాండ్..
సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డును శివారు ప్రాంతాలకు తరలించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మరికాసేపట్లో ఆసుపత్రి సూపరింటెండ్ను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి ఎంతోమంది పేషెంట్లు నిత్యం గాంధీకి వస్తుంటారని.. కరోనా వార్డును ఇక్కడే ఉంచితే సాధారణ పేషెంట్లకు కూడా ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వార్డు తరలింపుపై ప్రభుత్వం కూడా ఆలోచనలో పడిన సంగతి తెలిసిందే. వికారాబాద్లోని అనంతగిరిలో కరోనా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై బుధవారమే నిర్ణయం తీసుకుంటారని భావించినప్పటికీ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. గురువారం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గాంధీలో ఎందుకు వద్దు..
గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో కేవలం 27 పడకలు మాత్రమే ఉన్నాయి. దీంతో పెయిడ్ రూమ్స్ను కూడా ఐసోలేషన్ వార్డులుగా మార్చి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే అనుమానిత పేషెంట్ల తాకిడి అంతకంతకూ పెరుగుతుండటంతో గాంధీ ఆసుపత్రి కెసాపిటీ సరిపోవడం లేదు. పైగా గాంధీ ఆసుపత్రి నగరం నడిబొడ్డున ఉండటంతో.. కరోనా పేషెంట్లకు ఇక్కడ చికిత్స అందించడం రిస్క్ అని వైద్యాధికారులు భావిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న ఇతర పేషెంట్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కరోనా విస్తరించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు పాజిటివ్ లక్షణాల కేసులు..
ఇప్పటికైతే తెలంగాణలో ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మరో ఇద్దరిలో పాజిటివ్ లక్షణాలు బయటపడ్డప్పటికీ.. పుణే వైరాలజీ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే తప్ప ఆ కేసులను నిర్దారించలేమని వైద్యులు చెబుతున్నారు. ఇక కరోనా సోకిన టెకీతో సన్నిహితంగా మెలిగిన 47 మందిని గుర్తించిన వారికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 45 మందికి నెగటివ్ అని తేలింది. మిగతా ఇద్దరిలో వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అందులో ఒకరు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే హౌస్ కీపింగ్ స్టాఫ్ కాగా.. మరొకరు ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి. సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగి కొంపెల్లిలోని ఓ హోటల్లో పనిచేసినట్టు తెలియడంతో.. అధికారులు ఆ హోటల్కు వెళ్లి అక్కడివారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక ఆ ఉద్యోగి పనిచేసే కంపెనీలోని మిగతా ఉద్యోగులు సైతం కరోనా అనుమానంతో గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.

మొత్తం 28 కేసులు..
దేశంలో ఇప్పటివరకు 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కరోనాపై చర్చించేందుకు గురువారం హైదరాబాద్లో ఫిలిం చాంబర్ సమావేశం జరగబోతోంది. సినిమా షూటింగులు, థియేటర్ల బంద్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈసారి హోలీ వేడుకలకు సైతం దూరంగా ఉండాలని.. పబ్లిక్ ఫంక్షన్లకు కూడా దూరంగా ఉండాలన్న విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.
Recommended Video


ప్రపంచవ్యాప్తంగా 3వేల పైచిలుకు మరణాలు..
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 95,481 మంది వైరస్ బారినపడగా.. 3,286 మంది మృతిచెందారు. దాదాపు 53,668 మంది కోలుకున్నారు. మరో 6420 మంది పరిస్థితి విషమంగా ఉంది. చైనా తర్వాత దక్షిణ కొరియా,ఇటలీ,ఇరాన్,జపాన్,అమెరికాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. కరోనా ప్రపంచ సమస్యగా మారడంతో.. దాని నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications