కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ పౌర్ణమి నాడే... ఎందుకో తెలుసా ?
ఎట్టకేలకు కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్ . కేసీఆర్ ఈనెల 19న మంత్రివర్గాన్ని విస్తరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇన్ని రోజుల సుదీర్ఘ జాప్యం తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోటానికి కారణం ఏమిటి ? పౌర్ణమి నాడే మంత్రి వర్గాన్ని విస్తరించాలన్న నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నారు అంటే అందుకు బలమైన కారణమే వుంది.

జాతకాల సెంటిమెంట్ ... ముందస్తు ఎన్నికల కారణం అదే
ఏదైనా పని చేపట్టినప్పుడు వాస్తు, లక్కీ నంబర్, ముహూర్తం చూసుకోవడంచాలా మందికి సెంటిమెంట్. మరి తెలంగాణా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఏ పని చేసినా వాస్తు, జాతకం, పంచాంగం అన్నీ చూసుకునే చేస్తారు. అన్నిటి కంటే ఆయన లక్కీ నంబర్ రోజే ఏ పనికైనా శ్రీకారం చుడతారు. కేసీఆర్ లా జాతకాల సెంటిమెంట్ ఇప్పుడు రాజకీయరంగంలో బాగా పెరిగిపోయింది. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ చాలా ఎక్కువే . ఏ కార్యక్రమం తలపెట్టినా కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అలాగే లక్కీ నంబర్ రోజే ఏ కార్యక్రమం అయినా కేసీఆర్ చేపడతారు అనేది బహిరంగ రహస్యం. ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా కేసీఆర్ తనజాతకరీత్యా ముహూర్త బలం చూసుకునే చేస్తారన్నది వాస్తవం. 2019 ఎన్నికలకు వెళ్తే కలిసిరాదని చెప్పారని ముందస్తుకు వెళ్ళారు కేసీఆర్ . ఆయన అనుకున్నట్టే ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు.

ఏ పని చేసినా పూజలు , యాగాలతోనే .. కేసీఆర్ ను ఫాలో అవుతున్న గులాబీ నాయకులు
ఇక ఆ తరువాత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించిన ఆయన ఢిల్లీ కి వెళ్ళే ముందు వైజాగ్ లోని శారదాపీఠానికి వెళ్లి అక్కడ రాజశ్యామలా దేవి పూజ చేయించి మరీ వెళ్ళారు. ఆ తర్వాత ఆయత సహస్ర చండీ యాగం చేయించి తనకు ఉన్న ఆధ్యాత్మికతను , విశ్వాసాలను మరోమారు తేటతెల్లం చేశారు. దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని భావించిన ఆయన నమ్మకాలు పార్టీ నాయకులకు సైతం వంటబట్టాయి . వారు కూడా ఏ పని చెయ్యాలన్నా ముహూర్త బలం చూసుకుంటున్నారు.

కేసీఆర్ జాతక రీత్యా ... పౌర్ణమి చాలా శక్తివంతమైన ముహూర్తం అందుకే
ఇక ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ విషయంలో కూడా కేసీఆర్ తన జాతక చక్రాన్ని బట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కె.సి.ఆర్ జాతక రీత్యా పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు.ఆయన గ్రహ స్థితిని బట్టి పౌర్ణమి నాడు ఆయన ఏమి చేసినా తిరుగు ఉండదని శాసన సభ కార్యదర్శి , జ్యోతిష్యుడు అయిన నరసింహాచార్యులు చెప్పారు.కాబట్టి ఆ రోజు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే అది తిరుగులేకుండా పనిచేస్తుందని కెసిఆర్ విశ్వాసం. అందుకే సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 19న మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది.

మంత్రి పదవి వచ్చినా రాకున్నా ... నేతల టెన్షన్ కు చెక్ పడిందనే సంతోషం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 19వ తేదీన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకోవటం టీఆర్ ఎస్ శ్రేణులకు ప్రాణం వచ్చినట్టుగా ఉంది. మంత్రి వర్గంలో స్థానం కోసం ఇంత కాలం ఉత్కంఠగాఎదురుచూసిన వారు మంత్రిగా అవకాశం వచ్చినా రాకున్నా టెన్షన్ కు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసిన ఇప్పటికే రెండు మాసాలు అవుతోంది. తనతో పాటు మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణం చేయించిన ఆయన ఇదిగో అదిగో అంటూ తాత్సారం చేస్తూ వచ్చారు..ఒకే రకమైన శాఖలను వీలీనం చేసిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ భావించారు.ఒకే రకమైన శాఖల విలీనం కూడ పూర్తైంది. ఈ తరుణంలో కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ఈ నెల 19 వ తేదీని ముహుర్తంగా ఎంచుకొన్నారు. పౌర్ణమి రోజు పదకొండున్నర గంటలకు కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. బలమైన ముహూర్తం కావటంతో కేసీఆర్ తన క్యాబినెట్ అంతే బలంగా పని చేస్తుందని నమ్ముతున్నారు.












Click it and Unblock the Notifications