'10' పరీక్షలపై రేపు తేల్చనున్న కేసీఆర్.. రద్దు చేసి ప్రమోట్ చేస్తారా..?
తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం( మే 8) ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో... పరీక్షలు నిర్వహించాలా.. లేక విద్యార్థులను ప్రమోట్ చేయాలా.. అన్న అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్లో సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
హైదరాబాద్ మినహా జిల్లాల్లో పరీక్షలు నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. బోర్డ్ ఎగ్జామ్స్కు బదులు ఇదివరకు స్కూళ్లలో నిర్వహించిన అంతర్గత పరీక్షల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వాలా అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. విద్యాశాఖ అధికారులు కూడా పరీక్షలు రద్దు చేసి అంతర్గత పరీక్షల ఆధారంగా గ్రేడింగ్స్ ఇవ్వడమే ఉత్తమం అని సూచించినట్టు సమాచారం.
మొత్తం మీద లాక్ డౌన్ కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలపై రేపు ఏదో ఒకటి తేల్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. జూన్ 8 నుంచి జూన్ 29 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా తీవ్రత నేపథ్యంలో పరీక్షలు నిర్వహించవద్దంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ మినహాయించి జిల్లాల్లో పరీక్షలు నిర్వహించవచ్చునని తెలిపింది. అది సాంకేతిక సమస్యలకు దారితీసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పూర్తిగా పరీక్షలనే రద్దు చేసింది.