కేరళలో బోటు ప్రమాదం: తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి, మరో నలుగురికి గాయాలు
హైదరాబాద్: కేరళ రాష్ట్రంలో జరిగిన ప్రమాద ఘటన కామారెడ్డి జిల్లాలో విషాదం నింపింది. కేరళ రాష్ట్రంలోని పున్నమడ సరస్సులో హౌస్బోట్ మునిగిన ఘటనలో కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. మరో నలుగురు గాయపడగా, వారిని అలప్పుజా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం రాత్రి పర్యాటకులతోపాటు బోటు సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి(58) మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో మృతుడు రామచంద్రారెడ్డితోపాటు ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి, బంధువులు నరేందర్, నరేష్, పడవ సిబ్బంది సునంద్ లు ఉన్నట్లు తెలిపారు.
ఆరోజు రాత్రి టోల్ గేట్ వద్ద గల బోట్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన ఆర్కిడ్ హౌస్బోట్ సరస్సులో ప్రమాదవశాత్తు మునిగిపోయిందని పోలీసులు తెలిపారు. వీరంతా బుధవారం పర్యటన ముగించుకుని రాత్రి పడవలో బస చేసినట్లు చెప్పారు.
పడవ మునిగిపోవడాన్ని గమనించిన బోట్ సిబ్బంది.. మిగితా నలుగురిని కాపాడారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి పడవ అడుగున ఉన్న ప్లాంక్ విరిగిపోవడమే కారణమని, దీని వల్లే బోటులోకి నీరు చేరిందని వెల్లడించారు. దీంతో పడవ మునిగిపోవడంతో ఒకరు మరణించడంతోపాటు నలుగురు గాయపడ్డారని చెప్పారు.