ఖైరతాబాద్ మహాగణపతిని పూజిస్తే... ఏ విఘ్నం రాదు : గవర్నర్ నర్సింహన్
ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పూజల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్లో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి తొలిపూజ అందుకున్నాడు. ఖైరతాబాద్ లో ప్రతిష్టించిన శ్రీ ద్వాదశాదిత్యుడి తొలిపూజలో గవర్నర్ నరసింహన్ దంపతులు,హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూడా ఖైరతాబాద్ గణనాథుడిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ పూజల అనంతరం ప్రజలకు దర్శనమిస్తున్నాడు.
నర్సింహన్ గవర్నర్గా నియమితులైనప్పటి నుండి ఖైరతాబాద్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు నూతన గవర్నర్ గా తమిలిసై సౌందర్ రాజన్ నియమితులైన విషయం తెలిసిందే. దీంతో నర్సింహన్ గణేషుడికి చివరి పూజలు అందించారు. ఈనేపథ్యంలోనే గవర్నర్ దంపతులను
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం శాలువాతో సన్మానించారు. ఈ సంధర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఇక్కడికి రావడం అలవాటుగా అయిపోయింది. ఈ గణేశుడిని పూజిస్తే తెలంగాణకు ఎప్పుడు కూడా ఏ విఘ్నం రాదని తన నమ్మకమని చెప్పారు.

దేశంలోనే అతిపెద్ద వినాయకుడిగా ఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి వద్ద సందడి నెలకొంది. 61 అడుగుల ఎత్తు , 12 చేతుల్లో ఆయుధాలు, 12 తలలు, వాటి వెనుక సూర్య భగవానుడు, దానిపైన 12 తలల సర్పం, ఏడు గుర్రాలతో ద్వాదశాదిత్యుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ సందర్బంగా వినాయకుడి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 48 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిఘా పెట్టారు.












Click it and Unblock the Notifications