కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్
హైదరాబాద్: రాష్ట్ర రైతులను సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా మోసం చేశారని మండిపడ్డారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన రైతు గోస- బీజేపీ భరోసా భారీ బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. వరి వేయవద్దని కేసీఆర్ ప్రభుత్వమే చెబుతోందన్నారు.
రైతులకు వ్యవసాయ సబ్సిడీలు, వ్యవసాయ రుణాలు పావలా వడ్డీకి ఇవ్వట్లేదన్నారు. కల్తీ సీడ్ బౌల్గా తెలంగాణ మారే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా కేసీఆర్ సర్కారు పంటల బీమా పథకం అమలు చేయడట్లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల్లో 75 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

బీజేపీకి అధికారమిస్తే రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం గడ్డ నుంచి రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రజాకార్ల సమయంలో హిందువులను ఎలా ఊచకోత కోశారో మనకు తెలుసన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లేనని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ దేనికి ఓటేసినా మజ్లిస్కు ఓటేసినట్లేనని కిషన్ రెడ్డి అన్నారు.
ఎన్నికలొస్తేనే కేసీఆర్కు ప్రజలు గుర్తుకు వస్తారు: బండి సంజయ్
ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్కు ప్రజలు, హామీలు గుర్తుకు వస్తాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మళ్లీ మోసం చేసేందుకే కేసీఆర్ ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపికి అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారని చెప్పారు.
Live: ‘Raithu Gosa BJP Bharosa’ Sabha, SR & BGNR Grounds, Khammam, Telangana.#RaithuGosaBJPBharosa https://t.co/nmZtPt5bve
— G Kishan Reddy (@kishanreddybjp) August 27, 2023
ఖమ్మానికి ప్రత్యేక చరిత్ర ఉందని.. ఉద్యమాల గడ్డ, పౌరుషాల గడ్డ అని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన ఘనత ఖమ్మం జిల్లాకే దక్కిందన్నారు. కేసీఆర్ అసలు పేరు దుబాయ్ శేఖర్ అని.. మోసలు చేయడంలో ఆయన పీహెచ్డీ చేశారని విమర్శించారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ను కేసీఆర్ అవమానించారని బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు మోసం చేయడానికి వస్తున్నారని.. వారి మాటలు విని మోసపోవద్దన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్నారు.

కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారు: ఈటల రాజేందర్
ఖమ్మం గడ్డ నుంచి తెలంగాణ రైతులకు భరోసా ఇచ్చేందుకు అమిత్ షా వచ్చారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ రుణమాఫీ చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. రింగ్రోడ్డు, హైదరాబాద్ భూములు అమ్మి రుణమాఫీ చేస్తున్నారని ఆరోపించారు.
బంగారు తెలంగాణ మాటల్లోనే కానీ.. చేతల్లో లేదని విమర్శించారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చే అనేక సబ్సిడీలను ముఖ్యమంత్రి ఎత్తేశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీకి అధికారమిస్తే కిలో తరుగు కూడా లేకుండా పంటంతా కొంటామని ఈటల రాజేందర్ చెప్పారు. కేసీఆర్ ఎత్తేసిన సబ్సిడీలను.. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications