ఎమ్మెల్యేగా ఓడి నక్క తోక తొక్కిన కిషన్ రెడ్డి .. ఏకంగా కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం
Recommended Video
ఎమ్మెల్యేగా ఓడిన కిషన్ రెడ్డి నక్క తోక తొక్కారు. మంత్రి అయ్యే అదృష్టం రాసుంటే ఎవ్వరూ ఆపలేరు అన్న చందంగా ఆయనను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. 14 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ముందస్తు ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ ఓటమే ఇప్పుడు ఆయనను మంత్రిని చేసింది . గెలిస్తే మహా అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి శాసనసభాపక్ష నేత అయ్యేవారు. కానీ, ఇప్పుడు ఏకంగా కేంద్ర క్యాబినెట్ లోనే స్థానం దక్కించుకున్నారు.
ఎమ్మెల్యేగా ఓటమే కిషన్ రెడ్డిని మంత్రిని చేసింది
సాధారణంగా ఎవరైనా గెలుపే మైలు రాయిగా భావిస్తారు. కానీ కిషన్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యేగా ఓటమే ఆయనకు అదృష్టాన్ని అందించింది. చిన్న ఎమ్మెల్యే పోస్టు పోయినా పెద్ద కేంద్ర మంత్రి పదవి ఆయన్ను వరించింది. ఎమ్మెల్యేగా ఓడిపోయి తీవ్ర ఆవేదన చెందిన కిషన్ రెడ్డి తర్వాత కేవలం ఐదు నెలల్లోనే లోక్సభకు పోటీ చేశారు. సత్తా చాటారు. సికింద్రాబాద్ లోక్సభ నుండి పోటీ చేసిన ఆయన హోరాహోరీగా జరిగిన పోరులో 62 వేల భారీ మెజారిటీతో కిషన్ రెడ్డి గెలుపొందారు. దీంతో, రాష్ట్రం నుంచి కేబినెట్లో బెర్త్ అంటూ ఇస్తే కచ్చితంగా కిషన్ రెడ్డికే మొదటి అవకాశం వస్తుందని పార్టీ ముఖ్యులు భావించారు. నిజానికి 2014లోనే కిషన్ రెడ్డి లోక్సభకు పోటీ చేస్తారని, గెలిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అప్పుడు అది జరగలేదు. ఇప్పుడు అసలు ఊహించకుండా ఇది జరిగిపోయింది.
మంత్రిగా బండారు దత్తాత్రేయ స్థానాన్ని రీప్లేస్ చేసిన కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి గెలుపు ఖాయం అయినప్పటి నుంచే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. తెలంగాణా రాష్ట్రంలో ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ , కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేసి నాలుగు స్థానాలు సంపాదించింది. దీంతో ఈ దఫా తెలంగాణాపై దృష్టి పెట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగా పార్టీ బలోపేతానికి కిషన్ రెడ్డికి పదవి ఖాయం అని కూడా బీజేపీ నేతలు భావించారు . అదే జరిగింది. . అయితే, కిషన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖాయంపై చివరి క్షణం వరకూ ఢిల్లీలో సస్పెన్స్ కొనసాగింది.ఎట్టకేలకు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించి బండారు దత్తాత్రేయ స్థానాన్ని రీప్లేస్ చేశారు.
నక్క తోక తొక్కిన కిషన్ రెడ్డి .. కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా అదృష్టం
ముప్పై ఏళ్ళుగా పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ప్రియ శిష్యుల్లో ఆయన ఒకరు. జాతీయ నాయకులతో సత్సంబంధాలు నెరపగల నాయకుడు. ప్రధాని మోదీ, అమిత్ షా వద్ద కష్టపడి పనిచేసే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ అగ్ర నేతలకు చేరువైన ఆయన, ఆ తర్వాత ఆ సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ శాసనసభాపక్ష నేతగా చురుకైన పాత్ర పోషించారు. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగిన ఆయన ఎమ్మెల్యేగా ఓడినా ఎంపీగా గెలిచి మోడీ క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకోవటం మామూలు లక్ కాదు. కచ్చితంగా నక్క తోక తొక్కటమే.