కరోనా లాక్డౌన్ పొడగింపు: అదే ఆలోచనలో ఉన్నామంటూ కిషన్ రెడ్డి
హైదరాబాద్: కరోనావైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ గడువు ముగుస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గడువు పొడిగిస్తారా? లేక సడలిస్తారా? అనేదానిపై దేశ వ్యాప్త చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు కేంద్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

పొడగించేందుకే..
కాగా, తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లాక్డౌన్ పొడగింపు విషయంపై స్పందించారు. కరోనావైరస్ వ్యాప్తి తగ్గని నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. లాక్డౌన్ పొడిగించాలనే రాష్ట్రాలు కోరుతున్నాయని, నిపుణులు కూడా అదే చెబుతున్నారని అన్నారు.

అందుకే లాక్డౌన్..
ప్రజలు లాక్డౌన్కు సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అనవసర కారణాలతో బయట తిరగొద్దని సూచించారు. తాజా కూరగాయలు అవసరం లేదని, ఇందుకోసం ప్రజలు ప్రతిరోజూ బయటికి రాకూడదని అన్నారు. వారం రోజులకు సరిపడా కూరగాయలు, పప్పులు, నిత్యావసర సరుకులు దగ్గర పెట్టుకోవాలన్నారు. కూరగాయలు దొరకని పరిస్థితుల్లో పప్పులతో సరిపెట్టుకోవాలన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

వారు నిర్బంధంలోనే.. రూపాయి దుర్వినియోగం లేదు..
దేశంలో కరోనా టెస్టింగ్ కిట్ల కొరతలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నుంచి రెండు లక్షల కిట్లు వచ్చాయి. ఎక్కడివారు అక్కడేవుంటారు. విదేశాల నుంచి వచ్చి నిర్బంధంలో ఉన్నవారిని నిర్బంధం కొనసాగుతుందని చెప్పారు. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ఆరేళ్లలో కేంద్రం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చెయ్యలేదని, ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ సహా సీఎంలు..
లాక్ డౌన్ పొడగింపుపై అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత ప్రధాని నిర్ణయం తీసుకుంటారని కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 14న లాక్డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, దేశంలో ఇప్పటి వరకు 5194కి చేరింది. మరణాల సంఖ్య 150కి చేరింది.












Click it and Unblock the Notifications