ఇలాంటి ప్రధానమంత్రిని మీరేమని పిలుస్తారు?? నాలుగు ఆప్షన్స్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానిని మీరు ఎలా పిలుస్తారో తేల్చుకోవాలంటూ ప్రజలకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. దేశంలో చొరబాటుదారులను, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని ప్రధానమంత్రిని మీరేమంటారంటూ ట్వీట్ చేశారు. అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందంటూ జాతీయ మీడియాలో వచ్చిన వార్తను ట్వీట్కు యాడ్ చేశారు. శాటిలైట్ ఫొటోలతో సహా ఒక జాతీయ మీడియా ఈ వార్తను ప్రచురించింది. కేటీఆర్ ఇచ్చిన నాలుగు ఆప్షన్లు ఇలా ఉన్నాయి.
ఏ) 56''
బి) విశ్వ గురు
సి) అచ్చేదిన్ వాలే
డి) పైవన్నీ అన్పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి

అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
దేశంలో రోజురోజుకు ద్రవ్యోల్బణం పెరుగుతుండటంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. పాలు, పాలకు సంబంధించిన ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని విధించిన సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. పాల ఉత్పత్తులపై ఎప్పుడూ లేనివిధంగా పన్నులు విధించారని, బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాడి రైతులు భాగస్వాములవ్వాలని కోరారు. పెరుగు ప్యాకెట్లపై జీఎస్టీ విధించడమేంటని ప్రశ్నించారు.
ఎన్డీఆర్ఎఫ్ నిధులకు సంబంధించి కూడా కేటీఆర్ రాత్రి ప్రధానమంత్రి ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఒకవైపు భారీ వరదలతో తెలంగాణ రాష్ట్రం సతమతమవుతోంటే 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. 2020 హైదరాబాద్ వరదలకు, ఇప్పుడు గోదావరి వరదలకు ఎందుకు సాయం చేయడంలేదని, నిధులు విడుదల చేయకపోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. సబ్కా సాత్, సబ్ కా వికాస్, సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా? అని నిలదీశారు.












Click it and Unblock the Notifications