ఎన్నికలు ఏవైనా విజయం మాదే.. ఆ ఎలక్షన్లపై కూడా కేటీఆర్ ధీమా..!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా ప్రజలకు దగ్గరై బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఎంతలా అంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీ లేదా అనేంతలా తయారైంది పరిస్థితి. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాస్తో కూస్తో 19 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా తలకిందులైంది. హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గాంధీ భవన్ గడప దాటి గులాబీ వనంలోకి ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా స్థానిక సంస్థల్లోనూ టీఆర్ఎస్ పార్టీ జెండానే రెపరెపలాడింది.
ఆ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ మేరకు పలు అంశాలు ప్రస్తావించారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే టీఆర్ఎస్ పార్టీ విజయం ఏకపక్షమని అన్నారు. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఇతర పార్టీలు ఎంతలా హడావిడి చేసినా.. తేలిగ్గా తీసుకోవాలని, అసలు పట్టించుకోవద్దని సూచించారు. ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పుకొచ్చారు.

మున్సిపల్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే మున్సిపాలిటీల వారీగా టీఆర్ఎస్ పార్టీ బలం ఎంతుంటుంది.. ఇతర పార్టీల పరిస్థితి ఏంటి అనే విషయాలు పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. అంతేకాదు ఇతర పార్టీల్లో బలమైన నేతలున్నారా.. ఎవరి బలమేంటి అనే విషయాలు కూడా ఆరా తీశారు.












Click it and Unblock the Notifications