కరోనా కంటైన్మెంట్: ఇటు కేటీఆర్ భరోసా.. అటు కార్పొరేటర్ బర్త్ డే హంగామా.. ఇదీ hydలో సీన్
గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కేసులు నమోదుకావడంతో తెలంగాణలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 700కు పెరిగింది. అందులో 186 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం సాయంత్రం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 496గా ఉంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 90 శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటం గమనార్హం. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్ని కేంద్రం రెడ్ జోన్ జిల్లాలుగా గుర్తించిన సంగతి తెలిసిందే.

సిటీలో 139 కంటైన్మెంట్ జోన్లు..
రెడ్ జోన్ పరిధిలో ఉన్న హైదరాబాద్ సిటీలో.. వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా చైన్ను తెంపేందుకు 139 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కంటైన్మెంట్ ఇన్ అండ్ ఔట్ మార్గాలను పూర్తిగా సీజ్ చేశారు. ఆయా జోన్లలో జీహెచ్ఎంసీ, ఆరోగ్య శాఖ, పోలీస్, పౌరసరఫరాల శాఖల ఆధ్వర్యంలో సర్వేలెన్స్ టీమ్స్ ఏర్పాటుచేశారు. చెత్త తరలింపు దగ్గర్నుంచి ఆ ప్రాంతంలో క్రిమిసంహారకాలు చల్లించడం, ఇంటింటి సర్వే, సోషల్ డిస్టెన్స్ అమలు, అవాంఛనీయ సంఘనల నివారణ, కాంటాక్ట్ ట్రేసింగ్, రేషన్ సరుకుల పంపిణీ తదితర డ్యూటీను ఆయా టీమ్స్ నిర్వహిస్తున్నాయి. మున్సిపల్ మంత్రి కేటీఆర్ గురువారం సిటీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

మంత్రి భరోసా..
హైదరాబాద్ సిటీ, ఖైరతాబాద్ పరిధిలోని సీబీఐ క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటైన్మెంట్ జొన్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది యోగక్షేమాలు ఆరాతీశారు. ఇళ్లకే పరిమితమైపోయిన స్థానికులతోనూ ఆయన మాట్లాడారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని భరోసా ఇచ్చారు. మే 3 దాకా అందరూ ఇళ్లలోనే ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు వాడాలని కోరారు. ఎలాంటి వైద్య సహకారం కావాలన్నా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్ అయినప్పటికీ అత్యవసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పారు.

కార్పొరేటర్ హంగామా..
ఓవైపు ప్రజల్లో భరోసా నింపేందుకు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న సమయంలోనే.. సిటీలోని మరో కంటైన్మెంట్ జోన్ లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ భారీ ఎత్తున బర్త్ డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం వివాదాస్పదమైంది. జియాగూడ కార్పొరేటర్ మిత్ర కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అసలే లాక్ డౌన్, పైగా కంటైన్మెంట్ జోన్ అయినప్పటికీ నాయుడి పుట్టినరోజు సందర్భంగా టెంట్లు, డెకరేషన్లు, కేక్ కటింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో 50 నుంచి 100 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాళ్లంతా మాస్కులు ధరించినప్పటికీ, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుంపులుగా నిలబడటం కలకలం రేపుతున్నది. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సిఉంది.
Recommended Video

హోంగార్డు ఫ్యామిలీకి మంత్రి సాయం..
సిరిసిల్లలో లాక్ డౌన్ విధులు నిర్వహిస్తూ హఠాన్మరణం చెందిన హోంగార్డు దేవయ్య(50) కుటుంబానికి మంత్రి కేటీఆర్ రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బుధవారం సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న సమయంలోనే.. ఎల్లమ్మ చౌరస్తాలో డ్యూటీచేస్తోన్న దేవయ్య.. సొమ్మసిల్లి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేవరకే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఎండదెబ్బ కారణంగానే ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. హోంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మేరకు మంత్రి సహాయాన్ని ప్రకటించారు. మృతుడు సిలువేరి దేవయ్య సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేసేవారు.












Click it and Unblock the Notifications