కేంద్రమంత్రిని కలిసిన కేటీఆర్: కీలక ప్రతిపాదనలు, తెలంగాణకు ఆహ్వానం
న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం కలిశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో కేటీఆర్ చర్చించారు. వరంగల్-హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్-నాగపూర్ కారిడార్లు మంజూరు చేయాలని కోరారు.

కేంద్ర బడ్జెట్లో కేటాయించండి..
హైదరాబాద్-బెంగళూరు-చెన్నైలను కలుపుతూ నాలుగు రాష్ట్రాల మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఇందు కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ అంశంపై దక్షిణాది మంత్రులకు లేఖలు కూడా రాశామని తెలిపారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డ్రైపోర్టుతోపాటు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులకు మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు.
సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మాక్లస్టర్ ‘హైదరాబాద్ ఫార్మా సిటీ, జహీరాబాద్ నిమ్స్' వివరాలను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. కాగా, కేటీఆర్ ప్రస్తావించిన అంశాలపై వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని పీయూష్ గోయల్ తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇదిఇలావుంటే, ఫిబ్రవరి 17న హైదరాబాద్లో జరిగే బయో ఆసియా సదస్సుకు రావాల్సిందిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కోరారు.

తెలంగాణలో మరో ఆరు విమానాశ్రయాలు..
ఇదిఇలావుంటే, ఢిల్లీలో విమానయాన శాఖ గురువారం సాయంత్రం నిర్వహించిన ‘వింగ్స్ ఇండియా 2020'పై సన్నాహాక సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్రమంత్రి హార్దీప్ సింగ్ పూరీతోపాటు దేశ, విదేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని అన్నారు. రాష్ట్రంోలని 6 ద్వితీయ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. వరంగల్, ఆదిలాబాద్, జక్రాన్పల్లి, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్నగర్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విమాన, రక్షణ రంగానికి చెందిన ప్రసిద్ధ సంస్థలు ఇప్పటికే హైదరాబాద్లో తమ శాఖలను ఏర్పాటు చేశాయని చెప్పారు.












Click it and Unblock the Notifications