సారు, కారు, పదహారు తుస్.. ఇక 138 మున్సిపాలిటీలపై కన్ను.. ఈసారైనా తారక మంత్రం పారేనా?

సిరిసిల్ల : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కారు జోరు అంతా ఇంతా కాదు. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించింది. 88 స్థానాలు దక్కించుకుని ఎదురులేని శక్తిగా అవతరించింది. అంతవరకు బాగానే ఉన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కారు పల్టీ కొట్టింది. సారు, కారు, పదహారు అంటూ జనాకర్షణ మంత్రం జపించినా.. చివరకు ప్లాన్ తుస్సుమంది. 16 స్థానాల్లో గెలుస్తామంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రమంతటా పర్యటించినా లాభం లేకుండా పోయింది.

అదలావుంటే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ప్రకటించారు కేటీఆర్. 138 మున్సిపాలిటీల్లో గులాబీ జెండు ఎగురబోతోందని ధీమా వ్యక్తం చేశారు. దాంతో కేటీఆర్ మంత్రం ఈసారైనా పారుతుందా లేదా అనే వ్యాఖ్యలు వినిపిస్తుండటం గమనార్హం.

లోక్‌సభ ఎన్నికల వేళ పనిచేయని తారక మంత్రం

లోక్‌సభ ఎన్నికల వేళ పనిచేయని తారక మంత్రం

అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతకుముందు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు రెండో దఫా కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ కీలక బాధ్యతలు అప్పగించారు. దాంతో లోక్‌సభ ఎన్నికల వేళ అన్నీ తానై వ్యవహరించారు కేటీఆర్. ఉమ్మడి పది జిల్లాలో పార్టీ సన్నాహాక సమావేశాలు నిర్వహించి పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

సారు, కారు, పదహారు అంటూ తెలంగాణలోని లోక్‌సభ స్థానాలన్నీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఎక్కడకు వెళ్లినా, ఏ సభలో మాట్లాడినా అదే మంత్రం జపించారు. కానీ చివరకు సీన్ రివర్సయింది. కేవలం 9 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. మిగతా 7 స్థానాల్లో ఘోరంగా దెబ్బతింది.

138 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం..!

138 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం..!

ఆ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరో పెద్ద బాధ్యతను భుజాలకెత్తుకున్నారు కేటీఆర్. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం నాడు నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించిన సమయంలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 75 శాతం మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు అందించారని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌‌ను తిరుగులేని శక్తిగా మలిచారని హర్షం వ్యక్తం చేశారు. 32 జడ్పీ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకోవడం దేశ చరిత్రలో తొలిసారని వెల్లడించారు. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సాధించిన పార్టీగా టీఆర్ఎస్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని.. రాష్ట్రానికి టీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్షగా ప్రజలు భావిస్తున్నారని వివరించారు. ఆ క్రమంలో మున్సిపల్ పోరులోనూ ప్రజలు కారు గుర్తుకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

60 లక్షల సభ్యత్వాలు టార్గెట్.. మున్సిపల్ పోరు కోసమేనా?

60 లక్షల సభ్యత్వాలు టార్గెట్.. మున్సిపల్ పోరు కోసమేనా?

రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని తప్పుడు ప్రచారం జరుగుతోందని ఖండించారు కేటీఆర్. అవి అప్పులు కాదని.. భవిష్యత్తుకు పెట్టుబడులని వివరించారు. రెట్టింపు చేసిన పింఛన్లు జులై నెల నుంచి చెల్లిస్తామన్న కేటీఆర్.. వాటిని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్ల కోసం ఢిల్లీ నుంచి వచ్చేది జీరో మాత్రమేనని స్పష్టం చేశారు.

జులై 20వ తేదీ నాటికి 60 లక్షల టీఆర్ఎస్ సభ్యత్వాలు చేయించే టార్గెట్‌తో ముందుకెళుతున్నట్లు తెలిపారు కేటీఆర్. అందులో 35 శాతం క్రియాశీల సభ్యత్వాలు ఉంటాయని చెప్పారు. వారికి పార్టీ నుంచి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రతి కార్యకర్తకు 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడానికి ఏటా 15 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నట్లు వివరించారు. మొత్తానికి మున్సిపల్ పోరులో విజయకేతనం ఎగురవేసేలా సభ్యత్వ నమోదును స్పీడప్ చేసినా.. చివరకు ఫలితాలు వచ్చే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోననేది సందిగ్ధమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+