కరోనా లాక్డౌన్: తెలంగాణలో సడలింపులు.. ఉద్యోగుల జీతాల్లో మళ్లీ కోతలు.. హైదరాబాద్ సిటీలో బస్సుల్లేవ్.
కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి గురి కావాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. మరికొన్ని సడలింపులు ప్రకటించారు. అదే సమయంలో ఆర్థికపరమైన కఠిన నిర్ణయాలనూ వెలువరించారు. మే నెలలోనూ ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోతలు విధించారు. అంశాల వారీగా సీఎం నిర్ణయాలిలా ఉన్నాయి..
Recommended Video

కర్ఫ్యూ సడలింపు..
ఆర్టీసీ బస్సులకు గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జెబిఎస్ తో పాటు, ఇమ్లీబన్ లో కూడా ఆగేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. సరిగ్గా ఆర్టీసీ గాడిన పడుతున్న తరుణంలో కరోనా వచ్చిందని, బస్సులు తిప్పుతున్నా, రాత్రి కర్ఫ్యూ కారణంగా కేవలం 39 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వస్తున్నదని, కాబట్టే బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు చెప్పారు. బస్టాండ్లలో ట్యాక్సీలు, ఆటోలు తదితర రవాణా వాహనాలను అనుమతిస్తారని, బస్ టికెట్ కలిగిన ప్రయాణీకులు కర్ఫ్యూ సమయంలో కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి పోలీసులు అభ్యంతర పెట్టరని చెప్పారు.

అవి మాత్రం కుదరవు..
జిల్లాల నుంచి వచ్చే బస్సులన్నీ జేబీఎస్ తోపాటు ఎంజీబీఎస్ కు కూడా అనుమతిస్తామన్న ముఖ్యమంత్రి.. హైదరాబాద్ లో సిటీ బస్సులు మాత్రం ఇప్పట్లో ప్రారంభం కాబోవని స్పష్టం చేశారు. ‘‘హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి, మరికొన్ని రోజుల వరకు నగరంలో సిటీ బస్సులు నడపరు. అలాగే అంతర్రాష్ట్ర బస్సులను కూడా మరికొన్ని రోజుల పాటు నడపరు''అని కుండబద్దలుకొట్టారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
‘‘కరోనా వైరస్ సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే కొద్ది మందిలో మాత్రం లక్షణాలు కనిపిస్తున్నాయి. వారికి మంచి వైద్యం అందించాలి. సీరియస్ గా ఉన్న వారి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. వారిని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. పాజిటివ్ గా తేలినప్పటికీ లక్షణాలు లేని వారిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రజలు కూడా లాక్ డౌన్ నిబంధనలు,కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి'' అని సిఎం సూచించారు. కొన్ని అంచనాలు ప్రకారం రాబోయే రెండు మూడు నెలల్లో దేశంలో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని, అయినప్పటికీ ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఎంత మందికైనా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

మే నెల జీతాల కోత..
కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయిందని, లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా వ్యవస్థలు ఊపందుకోలేదని, కాబట్టి ఆర్థిక విషయాల్లో ఒకింత కఠిన నిర్ణయాలు తప్పవని, అలాగని వెల్ఫేర్ స్కీములకు ఏలోటూ రానివ్వబోమని సీఎం అన్నారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగుతుందని ప్రకటించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత ఉంటుందన్నారు. అప్పుల కిస్తీలు, ఆసరా పెన్షన్లను, పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాం అందిస్తామన్నారు. లాక్ డౌన్ కారణంగా పనికోల్పోయిన ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం జూన్ నెల నుంచి కొనసాగబోదని అన్నారు.

అన్నపూర్ణగా తెలంగాణ..
ఫుడ్ కార్పొరేష్ ఆఫ్ ఇండియా(ఎఫ్.సి.ఐ) దేశవ్యాప్తంగా ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో తెలంగాణ నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్లు ఆ సంస్థ సీఎండీ డీవీ ప్రసాద్ చేసిన ప్రకనటతో.. దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగినట్లు అర్థమవుతోందని కేసీఆర్ అన్నారు. పెరిగిన సాగునీటి లభ్యతను, ఉచిత విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించుకున్న తెలంగాణ రైతులు తమ వృత్తి నైపుణ్యంతో పంటలు పండించారని అభింనందించారు. రాబోయే రోజుల్లో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేపడితే తెలంగాణ ఇంకా విలసిల్లుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications