ముగిసిన నామినేషన్ల పర్వం.. నిజామాబాద్ బరిలో అత్యధికంగా 245 మంది పోటీ
హైదరాబాద్ : లోక్సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను ఇప్పటివరకు 699 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం.

మొత్తం 699.. ఇంకా పెరిగే ఛాన్స్
తెలంగాణలో లోక్సభ నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఈనెల 18వ తేదీన ప్రారంభమైన ప్రక్రియ సోమవారం (25.03.2018) నాటితో ముగిసింది. మొత్తం 17 పార్లమెంటరీ స్థానాలకు గాను ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. నామినేషన్ల సమయం ముగిసేటప్పటికీ మొత్తం 699 నామినేషన్లు దాఖలు కాగా మరికొన్ని పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అన్ని ప్రాంతాల నుంచి ఇంకా సరైన సమాచారం అందలేదని తెలుస్తోంది.

బరిలో నిలిచేది ఎందరో?
26వ తేదీ మంగళవారం అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలించనున్నారు. ఈనెల 28వ తేదీ గురువారం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
నామినేషన్ల పరిశీలనకు ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురు మాత్రమే హాజరు కావాలని సూచించారు రజత్ కుమార్. ఆయా స్థానాల్లో 90కి మించి అభ్యర్థులు బరిలో ఉంటే బ్యాలెట్లు పత్రాలు వినియోగిస్తామని తెలిపారు. నిజామాబాద్లో రైతుల నామినేషన్లు స్వీకరించడంలో నిబంధనలు ఉల్లంఘించలేదని వెల్లడించారు. నిజామాబాద్ లో అత్యధికంగా 245 నామినేషన్లు రావడంతో అక్కడ బ్యాలెట్ పేపర్ వినియోగించే అవకాశముంది.

అత్యధిక ఓటర్లు హైదరాబాద్ లో
తెలంగాణలో మొత్తం 2 కోట్ల 96 లక్షల 97 వేల 279 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
హైదరాబాద్ సెగ్మెంట్ లో అత్యధికంగా 41 లక్షల 77 వేల 703 మంది ఓటార్లు ఉన్నారు.
వనపర్తిలో అత్యల్పంగా 2 లక్షల 47 వేల 419 ఓటర్లు నమోదయ్యారు
. ఎన్నికల కోడ్ లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 10 కోట్ల 9 లక్షల రూపాయలు పట్టుబడినట్లు చెప్పారు.
అలాగే 2 కోట్ల 4 లక్షల విలువ చేసే మద్యం, 2 కోట్ల 45 లక్షల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

నిబంధనల పర్వం
ప్రగతిభవన్లో రాజకీయ కార్యకలాపాల నిర్వహణ ఫిర్యాదుకు సంబంధించి టీఆర్ఎస్ కు లేఖ రాశామని చెప్పారు. కాంగ్రెస్ ఫిర్యాదుపై ఈసీ ఆదేశాలకనుగుణంగా లేఖ రాసినట్టు తెలిపారు. అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని సూచించామన్నారు. సీఎంపై వీహెచ్పీ చేసిన ఫిర్యాదు నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు. తెలంగాణ పాకిస్థానా అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామన్నారు. రాజకీయ పార్టీలన్నీ తమతమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇచ్చాయని చెప్పారు.












Click it and Unblock the Notifications