మహా శివరాత్రి: హైదరాబాద్ నుంచి వేములవాడకు హెలికాప్టర్ సేవలు, అందుబాటు ధరల్లోనే..
హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ సహకారంతో ప్రారంభించింది.

హైదరాబాద్ నుంచి వేములవాడకు హెలికాప్టర్..
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. గురువారం నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచన మేరకు ఈ హెలికాప్టర్ సేవలను ప్రారంభించినట్లు తెలిసింది. వేములవాడ హెలికాప్టర్ సేవల బుకింగ్ కోసం 09400399999, 09880505905, 07994481767, 09544444693 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

తక్కువ సమయంలో వేములవాడకు..
శివరాత్రి పర్వదినం నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి కూడా భక్తులు ఏటా పెద్ద సంఖ్యలో తరలివెళ్తారు. హెలికాప్టర్ సేవలు ప్రారంభం కావడంతో అత్యంత తక్కువ సమయంలోనే వేములవాడ రాజన్నను దర్శించుకునే అవకాశం ఉంది. ధరలు కూడా అందుబాటులోనే ఉండటంతో ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా హెలికాప్టర్ సేవలను వినియోగించుకోవచ్చు.

అందుబాటు ధరల్లోనే సేవలు..
కాగా, వేములవాడకు హెలికాప్టర్ సేవలను మొత్తం మూడు రకాల ప్యాకేజీల్లో అందిస్తున్నారు. ప్యాకేజీ-1లో భాగంగా వేములవాడ నుంచి వ్యూ పాయింట్కు 7 నిమిషాల రైడ్కు టికెట్ ధర రూ. 3 వేలు, ప్యాకేజీ-2లో వేములవాడ మిడ్ మానేరు పరిసర ప్రాంతాలు వీక్షించడానికి రూ. 5,500. ఈ ప్యాకేజీ కోసం కనీసం ఆరుగురు వ్యక్తులు ఉండాలి. 16 నిమిషాల విహంగ వీక్షణం కల్పిస్తారు. ఇక ప్యాకేజీ-3లో హైదరాబాద్ నుంచి వేములవాడకు తీసుకెళ్లి దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్కు తీసుకొస్తారు. దీని టికెట్ ధర రూ. 30వేలు. ఈ ప్యాకేజీ కోసం కనీసం ఐదుగురు వ్యక్తులు ఉండాలి.
ఏసీ బస్సులు కూడా.. పర్యాటకం..
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వేములవాడకు ఏసీ బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ఆలయ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. భవిష్యత్తులో ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలు కొనసాగించనున్నట్లు తెలిపారు. అంతేగాక, మిడ్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు బోటు సర్వీసులు కూడా ప్రారంభించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications