ప్రైవేటు ఆసుపత్రులపై మంత్రి ఈటెల సీరియస్ .. నేడో, రేపో సమావేశం .. ఫైనల్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైద్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై రోజు రోజుకి ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కనీసం మానవత్వం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడం,డబ్బులు కట్టకుంటే శవాన్ని కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, తప్పుడు రిపోర్టులు,పేషెంట్ కి అవసరం లేని వైద్యం చేయడం వంటి అనేక ఘటనల నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన ఆయన కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల తీరు మారకపోవటంతో సీరియస్ అవుతున్న ఈటెల
ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ప్రతిరోజు అనేక కథనాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో, వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ ఆస్పత్రుల పై సీరియస్ అవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తమ ధోరణి మార్చుకోవాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన మంత్రి ఈటల రాజేందర్, హెచ్చరించినా మారని రెండు ఆసుపత్రులపై ఇప్పటికే కొరడా ఝుళిపించారు. కరోనా వైద్యం కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు.

నేడో, రేపో సమావేశం ... ఈ సారి ఫైనల్ వార్నింగ్
ఆసుపత్రుల అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల తీరు నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉండటంతో ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికోసం నేడో, రేపో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమై పద్ధతి మార్చుకోవాలని, లేదంటే కఠిన చర్యలకు వెనకాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భావిస్తున్నారని తెలుస్తుంది .

అంటువ్యాధుల నియంత్రణా చట్టం కఠినంగా అమలు
ఇప్పటికే చాలా ఆసుపత్రుల యాజమాన్యాలతో ఫోన్లో మాట్లాడిన ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సామాజిక బాధ్యత మెలగాల్సిన సమయంలో ప్రజలను ఆదుకోకపోగా ధనార్జనే ధ్యేయమా అంటూ ఈటెల మండిపడినట్లు గా సమాచారం. అంతేకాదు ఇదే పంథా కొనసాగిస్తే మిమ్మల్ని ఎవరు క్షమించరని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులు శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడిన ఆయన అంటువ్యాధుల చట్టాన్ని కఠినంగా అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video

రాష్ట్రంలో అమలులో చట్టం .. ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వానికి సర్వాధికారాలు
కేంద్ర అంటు వ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అంటు వ్యాధుల నియంత్రణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలోని ఉన్నతాధికారులకు కూడా ప్రైవేట్ ఆస్పత్రుల వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది.ఇప్పుడు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల తీరు స్పష్టంగా చూస్తున్న ప్రభుత్వం ఈ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని,కేసులు పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications