హిమాన్షుపై కామెంట్స్: మంత్రి కేటీఆర్ గుస్సా.. మల్లన్నకు ఇదే నేర్పిస్తున్నారా అంటూ
కేసీఆర్, కేటీఆర్తో తీన్మార్ మల్లన్న వైరం కొనసాగుతోంది. ఆయన ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన క్యూ న్యూస్ చానల్ సోషల్ మీడియాలో నిర్వహించిన పోల్ కాంట్రవర్సీగా మారింది. దీనిపై మంత్రి కేటీఆర్ గుస్సా అయ్యారు. ఆ పోల్ లో అభివృద్ధి ఎక్కడ జరిగింది అని నెటిజన్లను ప్రశ్నించారు. భద్రాచలం గుడిలోనా...? హిమాన్షు శరీరంలోనా...? అని రెండు ఆప్షన్లు ఇచ్చారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
కుమారుడి రూపాన్ని విమర్శించడం పట్ల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ నేతలకు మీరు నేర్పిస్తున్నది ఇదేనా? అసహ్యకరమైన రాజకీయ వ్యాఖ్యల ద్వారా తన బిడ్డ శరీరాకృతిని విమర్శించడం సంస్కారం అనిపించుకుంటుందా? మోడీ కుటుంబాన్నో, అమిత్ షా కుటుంబాన్నో మేం ఈ విధంగా విమర్శించలేమని అకుంటున్నారా? అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు.
ఈ అంశంపై మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఇలా బురద చల్లేవారిని వదిలేయాల్సిందేనా? అంటూ కేటీఆర్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. "మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా. ఇది తీవ్రమైన సమస్య. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే చట్టాన్ని తీసుకురాలేరా?" అని ప్రశ్నించారు. అందుకు కేటీఆర్ స్పందించారు. జన జీవనంలో ఎందుకున్నామా అని ఒక్కోసారి అనిపిస్తుంటుందని బదులిచ్చారు. 'ముఖ్యంగా ఇప్పటి సోషల్ మీడియా యుగంలో ఎవరైనా ఏదైనా సిగ్గులేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రచారం చేస్తున్నారని అని చెప్పారు.
జర్నలిజం పేరుతో 24 గంటలపాటు నాన్సెన్స్ సృష్టించే కొన్ని యూట్యూబ్ చానళ్ల రొంపిలోకి చిన్నారులను కూడా లాగుతున్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఇతరులను దూషించడానికి, బురద చల్లడానికి హక్కులా మారిందని.. సోషల్ మీడియా జర్నలిజం ముసుగులో పుకార్లు, అనవసరమైన చెత్త అంతా ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. వికృతాలకు సోషల్ మీడియా అడ్డాగా మారిపోయిందని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్కు కేటీఆర్ ఆన్సర్ చేశారు.