బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వకుండా తెలంగాణ పెద్ద అన్యాయం: కేంద్రంపై కేటీఆర్ విమర్శ
హైదరాబాద్: తెలంగాణ పట్ల కేంద్రంలోని మోడీ సర్కారు వివక్ష చూపుతోందని ఆరోపించారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. కేంద్రం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో రాష్ట్రానికి చోటు దక్కకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని హైదరాబాద్ను ఉద్దేశపూర్వకంగా విస్మరించి.. ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంపిక చేయడం మోడీ సర్కార్ వివక్షపూరిత రాజకీయాలకు పరాకాష్ఠ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్పై కేంద్రం వివక్ష అంటూ కేటీఆర్
ఈ మేరకు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మా సిటీ పేరును కనీసం పరిశీలించకపోవడం అన్యాయమన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా ఎన్నో సార్లు కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని... తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ఫార్మాసూటికల్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలనూ సమర్పించామని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఫార్మసిటీలోని 2వేల ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి స్పష్టం చేస్తూ.. మాస్టర్ ప్లాన్ను కూడా అందజేశామన్నారు. కీలకమైన భూసేకరణ, పర్యావరణ అనుమతులతో పాటు ఫార్మాసిటీకి ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ కేంద్రానికి సమగ్రమైన నివేదిక ఇచ్చామని తెలిపారు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు కేటీఆర్. తెలంగాణకు చోటు దక్కకపోవడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
కేంద్రానికి చిత్తశుద్ది లేకే ఇలాంటూ కేటీఆర్ ఫైర్
కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు చేయాలంటే భూసేకరణ, ప్లానింగ్, డిజైన్, పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకోవడానికే కనీసం మూడేళ్ల సమయం పడుతుందని కేటీఆర్ చెప్పారు. దేశీయ ఫార్మా రంగాన్ని అత్మనిర్భరత వైపు త్వరగా తీసుకుపోవాలన్న ఉద్దేశంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే కనీసం మరో రెండు మూడేళ్లు పట్టే ప్రాంతాలకు పార్కుల కేటాయింపును చేసేది కాదన్నారు. తెలంగాణకు కేటాయిస్తే వెంటనే పని ప్రారంభించవచ్చన్న కనీస సోయి కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం దేశ ప్రజల దురదృష్టమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణను విస్మరించడమంటే పురోగతిని అడ్డుకోవడమేనంటూ కేటీఆర్
మోడీ సర్కార్ నిర్వాకంతో దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడుతున్న ఫార్మా పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలగడంతో పాటు బల్క్ డ్రగ్ తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఆశయానికి తూట్లు పొడవడమేనని విమర్శించారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణని విస్మరించడమంటే దేశీయ ఫార్మా రంగం పురోగతిని దారుణంగా దెబ్బతీయడమే అని విమర్శించారు. రాజకీయ ప్రజయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.