సిగ్గుపడాలి..చేయని సాయం చేసినట్లు - బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్ - లెక్కలతో బండి సంజయ్ కౌంటర్
''కరోనా నియంత్రణలో సీఎం కేసీఆర్ దారుణంగా ఫెయిలయ్యారు. తెలంగాణలో కరోనా నియంత్రణకు కేంద్రం రూ. 7 వేల కోట్లు పంపిస్తే.. ఆ నిధులను కేసీఆర్ దారి మళ్లించాడు.. ప్రజల్ని చావు ఊబిలోకి నెట్టేశాడు..'' అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఆలస్యంగానైనా ఆధారాలతోసహా స్పందించారు. కేంద్రం ఇచ్చిన నిధులకు, ఇక్కడి బీజేపీ నేతలు చెబుతున్న లెక్కలకు మధ్య వ్యత్యాసాన్ని బట్టబయలుచేశారు. అయితే, బండి సంజయ్ సైతం అదే స్థాయిలో లెక్కలతో సహా మంత్రికి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇద్దరు నేతల మధ్య సోమవారం తీవ్రస్థాయి మాటల యుద్ధం నడిచింది.

సిగ్గుపడాలి.. తప్పుడు ప్రచారం..
‘‘తెలంగాణలో కరోనా నియంత్రణకు కేంద్రం రూ. 7 వేల కోట్లు విడుదల చేసిందని రాష్ర్ట బీజేపీ ఎంపీలు పేర్కొంటున్నారు. కానీ కేవలం రూ. 290 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు కేంద్రమే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. బీజేపీ ఎంపీలు ఇంత పెద్ద స్థాయిలో అసత్య ప్రచారం చేసుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించడం ఏమాత్రం సరికాదు'' అని కేటీఆర్ మండిపడ్డారు. కొవిడ్ నిధులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన నోట్ను కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

అది సంజయ్ అడిగిన ప్రశ్నే..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ నెల 18న లోక్సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. తెలంగాణలో కరోనా కేసుల వివరాలు, కొవిడ్ నివారణ చర్యలకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందని ప్రశ్నించగా.. కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రి నోట్ ప్రకారం.. కొవిడ్పై పోరాటానికి తెలంగాణకు కేంద్రం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 33.40 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 256.89 కోట్లను(సెప్టెంబర్ 10 వరకు) విడుదల చేసింది. అంటే మొత్తం రూ.290 కోట్లు కేంద్రం ఇస్తే.. బీజేపీ ఎంపీలు మాత్రం రూ.7వేల కోట్లు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

కేటీఆర్.. ఇవిగో లెక్కలు..
కొవిడ్ నియంత్రణ కోసం కేంద్రం ఇచ్చిన నిధులపై బీజేపీ అసత్యాలను ప్రచారం చేస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. కరోనా సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన రూ. 7 వేల కోట్ల కేటాయింపుల వివరాలను ఆయన వెల్లడించారు. రైతులకు రూ. 696 కోట్లు, మహిళల జన్ ధన్ ఖాతాల్లో రూ. 789 కోట్లు,ఉజ్వల లబ్ధిదారులకు రూ. 180 కోట్లు, భవన నిర్మాణ కార్మికులకు రూ.126.9కోట్లు, ఈపీఎఫ్ విత్ డ్రాయల్ కు రూ. 174 కోట్లు, స్టేట్ డిజాస్టర్ ఫండ్ కు రూ. 599 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 982 కోట్లు, వృద్ధాప్య,వితంతు,దివ్యాంగ పెన్షనర్లకు రూ.68.1 కోట్లు, మన్ రేగాకు అదనంగా ఇస్తున్నది రూ.1004.09 కోట్లు, ఉచిత బియ్యానికి రూ. 1261.41 కోట్లు, ఉచిత కందిపప్పుకు రూ. 262.60 కోట్లు, ఉద్యోగులకు చెల్లిస్తున్న పీఎఫ్ రూ. 7.68 కోట్లు, డిస్ట్రిక్ మినరల్ ఫండ్ కు రూ.1001 కోట్లు.. మొత్తం కలిపి రూ.7వేల కోట్ల మేర తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు అందాయని బండి సంజయ్ తెలిపారు.
Recommended Video

బిల్లులపై సంబురాలేవి?
కొవిడ్ నియంత్రణకు నిధుల అంశంతోపాటు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపైనా మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. బీజేపీ చెబుతున్నట్లు వ్యవసాయ బిల్లులు నిజంగా చారిత్రాత్మకమే అయితే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడం లేదు? ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా ఎందుకు రాజీనామా చేస్తున్నాయి? అని ఆయన ప్రశ్నించారు. రైతులకు మేలు చేసేలా కొత్త రెవెన్యూ చట్టం బిల్లును గత వారంలో తెలంగాణ అసెంబ్లీ ఆమోదిస్తే రాష్ట్రమంతటా సంబురాలు జరిగాయని కేటీఆర్ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications