కేంద్రం తీరు సరికాదు.. హస్తినలో నిరీక్షిస్తే పట్టనట్టు ఉంటుంది: మంత్రి నిరంజన్ రెడ్డి
యాసంగిలో వరి.. వానాకాలం వరిపంట కొనుగోలు అంశం.. కేంద్రం- తెలంగాణ ప్రభుత్వంపై మాటల యుద్దానికి దారితీసింది. ఈ అంశంపై టీఆర్ఎస్- బీజేపీ నేతలు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోడీ సర్కార్ రాష్ట్రాల అభిప్రాయాలకు విలువనివ్వడం లేదన్నారు. ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతుందని ధ్వజమెత్తారు.
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో తెలంగాణ సర్కారు పోరాటం కొనసాగుతోంది. ధాన్యం సేకరణ అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నామని, రెండ్రోజుల్లో నిర్ణయం చెబుతామన్న కేంద్రం ఇంతవరకు స్పందించలేదని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ వచ్చింది ప్రేమలేఖలు రాయడానికి అన్నట్టుగా కేంద్రమంత్రుల వైఖరి ఉందని విమర్శించారు. ఏ ఒక్క అంశంలోనూ కేంద్రం నుంచి సరైన రీతిలో సాయం అందడంలేదని అన్నారు. బాధ్యతలను విస్మరించిన కేంద్రం రాష్ట్రాలపై దాడి చేస్తోందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదే సమయంలో బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ఇంకెవ్వరూ వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టని రీతిలో నిరుత్సాహకరంగా వ్యవహరిస్తున్నారు. ఆఖరికి జీఎస్టీ నిధులను కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడిగేందుకు వచ్చిన మంత్రులను అవమానిస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం విధానాలతో రైతులు బాధపడుతున్నారని, కార్పొరేట్ సంస్థలకు దగ్గరుండి ఒప్పందాలు కుదుర్చుతున్న ప్రభుత్వం రైతులను మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
వరి కొనుగోలు అంశం కేంద్ర- రాష్ట్రాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తీసుకొచ్చింది. దీనిపై డైలాగ్ వార్ జరుగుతుంది. వివిధ అంశాలపై కేంద్ర పెద్దలను కలువడానికి వస్తే వారు పట్టించుకోవడం లేదని మంత్రులు అంటున్నారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని నిరంజన్ రెడ్డి పైరయ్యారు. గత కొంతకాలంగా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.