మంత్రి పదవి రాలేదు.. ఎమ్మెల్యే అలక.. కేసీఆర్ ఎదుట అసంతృప్తి..!
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్లో అసంతృప్తి సెగ రాజేస్తోంది. సీనియర్లను కాదని జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని కొందరు అంటుంటే.. తమకు మాటిచ్చి సీఎం కేసీఆర్ హ్యాండిచ్చారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యహరించిన తీరు చర్చానీయాంశమైంది.
తెలంగాణ కేబినెట్ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత లుకలుకలు బయట పడేస్తోంది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది నేతలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పార్టీ పెద్దలపై అసమ్మతి గళం వినిపిస్తున్నారు. కచ్చితంగా తమకు మంత్రి పదవి వస్తుందని ఆశించినవారు కేబినెట్ విస్తరణలో తమ పేరు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అదలావుంటే అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు పార్టీ పెద్దలు. ఆ క్రమంలో అసంతృప్త నేతలుగా ముద్రపడ్డ రాజయ్య, జూపల్లి, బాజిరెడ్డితో వారు ఫోన్లో మాట్లాడటంతో బెట్టు దిగి పార్టీకి విధేయులుగా ఉంటామని ప్రకటించారు. అయితే జోగు రామన్న, మైనంపల్లి హన్మంత రావు మాత్రం ఇంకా టచ్లోకి రాలేదని సమాచారం.
అదలావుంటే మంత్రి పదవి రాకపోవడంతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అలకబూనినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మంగళవారం నాడు సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. తనకు ఇచ్చిన విప్ పదవి వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గాంధీ.. తన సామాజిక వర్గం కోటాలో జూనియర్కు మంత్రిగా అవకాశం ఇవ్వడం జీర్ణించుకోలేక పోతున్నారనే టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications