ఖైరతాబాద్ గణేశుడికి తాపేశ్వరం నుంచి లడ్డూ రావడం లేదు: సిటీ నుంచే ఎవరంటే..?
హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గాక, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైరతాబాద్ వినాయకుడు నేటి ఉదయం నుంచి పూజలందుకుంటున్నాడు. ఎంతో ప్రత్యేకంగా కలిగివున్న ఖైరతాబాద్ గణేశున్ని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
ఖైరతాబాద్ గణేశుడికి తాపేశ్వరం లడ్డూ ఇక రాదు
ప్రతి ఏడాది ఒక్కో రూపంలో దర్శనమిస్తుంటారు ఖైరతాబాద్ గణేశుడు. ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనిమిస్తున్నాడు. కాగా, ఈ భారీ గణనాథుడి కోసం అంతే స్థాయిలో భారీ లడ్డూను చేయిస్తారు నిర్వాహకులు. ఇలాంటి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు వేల సంఖ్యలో పోటీపడుతుంటారు. గత 12ఏళ్లుగా తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ గణపతి కోసం లడ్డూను తీసుకొస్తారు. అయితే.. ఈ సంప్రదాయానికి ఈ ఏడాదితో బ్రేక్ పడనుంది. ఈ ఏడాది నుంచి భారీ లంబోదరుడి లడ్డూను స్థానికంగానే తయారు చేయించారు.
సిటీ నుంచే ఖైరతాబాద్ గణేశుడికి భారీ లడ్డూలు
ఈ ఏడాది హైదరాబాద్వాసీల నుంచి 2000 కేజీల లడ్డును తయారు చేయించారు. ఈ ఏడాది వినాయకస్వామి ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కూలర్స్ యజమాని శ్రీకాంత్ నుంచి 1100 కేజీల లడ్డును లంబోదరుడి కోసం సిద్ధం చేశారు. భక్తాంజనేయ స్వీట్ నుంచి 900 కేజీల లడ్డును స్వామివారి సమర్పించనున్నారు. కాగా, స్వామివారికి సమర్పించేందుకు తయారు చేసిన మహా ప్రసాదం లడ్డును ప్రత్యేక వాహనాల్లో ఖైరతాబాద్కు తీసుకువస్తారు. తీసుకువచ్చిన తర్వాత స్వామివారి ముందు ప్రత్యేక స్థలంలో ఈ లడ్డును పెట్టి స్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.
12ఏళ్లుగా తాపేశ్వరం సురుచి నుంచే లడ్డూ..
కాగా, తాపేశ్వరానికి చెందిన 'సురుచి ఫుడ్స్' అధినేత మల్లిబాబు.. 2010 నుంచి ఖైరతాబాద్ గణపతి కోసం భారీ లడ్డూను నైవేద్యంగా పంపుతున్నారు. ఈ లడ్డూ పలుమార్లు గిన్నిస్ బుక్లోనూ చోటు దక్కించుకుంది. గణపతి నిమజ్జనం తర్వాత మల్లిబాబు తాను సమర్పించిన లడ్డూలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకునేవారు. మిగతా లడ్డూను నిర్వాహకులు భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేవారు.
Recommended Video
ఖైరతాబాద్ గణేశుడి దర్శనం.. ట్రాఫిక్ ఆంక్షలు
మరోవైపు, గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్య రానుండటంతో ట్రాఫిక్ పోలీసులు పలు చోట్ల మళ్లింపు చర్యలు చేపట్టారు. భక్తులు సొంత వాహనాల్లో రాకుండా మెట్రో, ఎంఎంటీఎస్లలో రావాలని సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఖైరతాబాద్ ప్రధాని రహదారిలో రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి రైల్వే గేటు మీదుగా విగ్రహం వైపు వాహనాలకు అనుమతించడం లేదు. ఐమాక్స్, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రభుత్వ ముద్రణాలయం వైపు వాహనాలకు కూడా అనుమతి లేదు. లక్డీకపూల్లోని రాజ్దూత్ మార్గంలో వచ్చే వాహనాలు వార్డు కార్యాలయం లేదంటే మార్కెట్ వైపు మళ్లీస్తారు. నెక్లెస్ రోడ్ రోటరీ మీదుగా దర్శనం కోసం వచ్చే వారి వాహనాలు ఐమ్యాక్స్ సమీపంలో హెచ్ఎండీఏ పార్కులో పార్కింగ్ చేసుకోవాలి. వృద్ధులు, నడవలేనివారు ఉంటే అలాంటివారి ఫోర్ వీలర్స్ను మింట్ కాంపౌండ్లో పార్కింగ్ చేసుకునేందుకు అనుమతిస్తారు. టూ వీలర్స్ ఎప్పటిలాగా మింట్ కాంపౌండ్ రోడ్డు, ఐమ్యాక్స్ ముందున్న హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలంలో నిలపవచ్చు. ఖైరతాబాద్ ప్రధాన రహదారి గుండా వచ్చే వాహనదారులు ఆ మార్గంలో పలు భవనాల పార్కింగ్ ప్రదేశాల్లో అనుమతి ఇచ్చామని వాటిని వినియోగించుకోవచ్చని పోలీసులు సూచించారు. ఇక ఖైరతాబాద్ కు మెట్రోలో వచ్చే భక్తులు ఐసీఐసీఐ బ్యాంకు వైపు నుంచి మాత్రమే కిందకు దిగాలి. మెట్రో సిబ్బంది ఈ విషయంలో సూచనలు చేస్తారని తెలిపారు.